<p>Telangana CM Revanth Reddy | న్యూఢిల్లీ: హైదరాబాద్‌ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి కోసం ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుజరాత్ లోని సబర్మతి తీరంలా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్యూచర్‌ సిటీకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును కూడా కేంద్రాన్ని కోరినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఎక్కడ అభివృద్ధి చెందబోతుందో, ఇంకా రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రపై కూడా ఆయన ప్రస్తావించారు. "తెలంగాణ రైజింగ్‌ 2047" పేరుతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని ఆయన వెల్లడించారు.</p>
<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు అవకాశాలు, పెట్టుబడులు, పర్యావరణ పరిరక్షణ, ఇతర ముఖ్య అంశాలపై ప్రసంగించారు. రాజ‌కీయ సంక‌ల్పం ముఖ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలన కోసం రాజకీయ సంకల్పం ఎంత ముఖ్యమో చెప్పారు. పరిపాలనను ప్రభావవంతంగా నిర్వహించడానికి సక్రమమైన రాజకీయ సంకల్పం అవసరం అన్నారు. </p>
<p><strong>తెలంగాణ మూడు భాగాలుగా విభజన</strong><br />రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు విభాగాలుగా - కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ - గా విభజించినట్టు పేర్కొన్నారు. ‘‘కోర్ అర్బన్ ప్రాంతంలో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాం. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం ‘‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047’’ రూపొందించాం. మా ఆలోచన భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించడం’’ అని ఆయన చెప్పారు.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/09/19/656ff3665b6b72c118c0d243612f271d1758276408202233_original.jpg" /></p>
<p><strong>మెట్రో విస్తరణ</strong><br />‘‘హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో సబర్మతీ తీరంలా, మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టాం’’ అని <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> పేర్కొన్నారు.</p>
<p><strong>ఎలివేటెడ్ కారిడార్లు & ఎలక్ట్రిక్ వాహనాలు</strong><br />2027 నాటికి ‘‘హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండేలా చూస్తున్నాం. అందుకోసం ఈవీలకు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘‘రిజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి ‘ప్రణాళికలు సిద్ధం చేసాం. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానంతో ‘‘పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం. తెలంగాణలో పెట్టుబడుల భద్రత ఉంటుంది’’ అని సీఎం తెలిపారు.</p>
<p><strong>డ్రగ్స్ నిర్మూలన</strong><br />‘‘తెలంగాణలో డ్రగ్స్‌ను కంట్రోల్ చేశాం. దేశంలోనే డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’’ను ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీ నుంచి చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ఒలింపిక్స్ పతకాలు సాధించే లక్ష్యంతో, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం’’ అని ప్రకటించారు.</p>
<p>తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లక్డ్) కావడంతో మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలనే ప్రణాళిక ఉంది. 2025, డిసెంబర్ 9 న, తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో మనకు నష్టం జరుగుతోంది. ఆయన ఒక రోజు మోదీ నా ఫ్రెండ్ అంటారు, మరొకరోజు సుంకాలు పెంచుతారు’’ అని సెటైర్లు వేశారు. </p>