<p><strong>Disha Patani Father After Encounter:</strong> సెప్టెంబర్ 17 బుధవారం బరేలీలో తమ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ.</p>
<p>"నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున నేను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన నాకు హామీ ఇచ్చిన విధంగానే నేరస్థులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకున్నారు. నేను ఈరోజు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడాను ..ఆయన మార్గదర్శకత్వంలో యూపీ ప్రభుత్వం యూపీ పోలీసులు భయరహిత సమాజాన్ని పూర్తిగా సాకారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని రిటైర్డ్ DSP అయిన జగదీష్ పటానీ ఒక వీడియో సందేశంలో తెలిపారు. </p>
<h4>ఎన్‌కౌంటర్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి మృతి</h4>
<p>బరేలీలోని పటానీ పూర్వీకుల నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారని అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, హర్యానా ఎస్‌టీఎఫ్ మరియు యూపీ ఎస్‌టీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఢిల్లీకి చెందిన ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.</p>
<p>సెప్టెంబర్ 12న తెల్లవారుజామున కాల్పుల ఘటన జరిగింది. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న పటానీ కుటుంబ ఇంటిపై కాల్పులు జరిగాయి, అక్కడ ఆమె తండ్రి, తల్లి ,పెద్ద సోదరి ఖుష్బూ పటానీ ఉన్నారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ దాడికి తానే బాధ్యత వహిస్తున్నానని, పటానీ ఆమె సోదరి ఇద్దరు మత పెద్దలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ దాడి జరిగిందని ఆరోపించారు. </p>
<p>ఘజియాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర, సోనిపట్‌కు చెందిన అరుణ్ అనే ఇద్దరు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి..చికిత్స పొందుతూ మృతి చెందారు.</p>