<p><strong>ED Raids in AP Liquor Scam:</strong> ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. స్కామ్‌లో బ్లాక్ మనీని వైట్‌గా మార్చడం, విదేశాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి వివిధ సూట్‌కేసు కంపనీల్లో పెట్టుబడులు పెట్టారనే అనుమానాలు ఉన్నాయి. వాటిని నిగ్గుతేల్చే పనిలో పడింది ఈడీ. అందుకే ఈ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. </p>
<p>ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీలాండరింగ్ మధ్యవర్తులపై ఫోకస్ పెట్టింది. అందుకే గురువారం ఉదయం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, తమిళనాడు, <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a>తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అనుమానితుల ఇళ్లు ఆఫీసులపై సోదాలు నిర్వహించింది. ఇరవైకి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. </p>
<p>ముందు ఈ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ చేసిన దర్యాప్తు, నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ జోక్యం చేసుకుంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలు ఉండి, భారీగా నిధులు దారి మళ్లించారనే అనుమానాలు వ్యక్తం చేయడంలో కేస్‌ను టేకప్ చేసింది. బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు హవాలా ప్రక్రియ ద్వారా దాదాపు ₹3,500 కోట్లు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇందులో కీలక పాత్ర ఉన్న వారిపై ఈడీ దృష్టి పెట్టింది. వారే లక్ష్యంగా సోదాలు చేస్తోంది. </p>
<p>ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుంచి కూడా ఇప్పటికే ED వాంగ్మూలాలు తీసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కాసిరెడ్డి వాంగ్మూలం కూడా రికార్డు చేసింది. వాటి ఆధారంగానే ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. </p>
<p>2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) నుంచి సరఫరా ఆర్డర్‌లను పొందడానికి 16 మద్యం కంపెనీలు 1,677 కోట్ల రూపాయల లంచం ఇచ్చాయని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కేసు నమోదు చేసింది. దీనికి బదులుగా ఆయా కంపెనీలు 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందినట్లు పేర్కొంది. <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> ప్రభుత్వ హయాంలో APSBCL 23 వేల కోట్ల రూపాయల విలువైన సరఫరా ఆర్డర్‌లను జారీ చేసిందని, వాటిలో 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీలలో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్ళాయని SIT తెలిపింది.</p>
<p>3,500 కోట్లకుపైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా మళ్లించినట్టు అనుమానిస్తోంది. సిట్ దర్యాపులో వెలుగు చూసిన అంశాల ఆధారంగానే ED మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. నిందితులకు, ఆయా సంస్థలు సమన్లు జారీ చేసింది. ఇప్పుడు సోదాలు చేస్తోంది. </p>