<p>AP SMAM 2026 Applications: ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యంత్రాలపై 50 శాతం సబ్సిడీ అందించే ' AP SMAM Agriculture Mechanization Subsidy 2026' స్కీమ్ కు అప్లికేషన్లు ఆహ్వానించింది. ఈ స్కీమ్ లో ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ సహా వ్యవసాయ పరికరాలపై రూ. 50,000 వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అధికారిక మెమో జారీ చేశారు. చిన్న, మధ్యతరగతి, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. </p>
<p>సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (SMAM) స్కీమ్ లో 60 శాతం సబ్సిడీని కేంద్రం భరిస్తుంది. మిగతా 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్కీమ్ లో భాగంగా ఏపీకి మొత్తం రూ.136.62 కోట్లు గ్రాంట్ అయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ.112.5 కోట్లను పలు జిల్లాలకు కేటాయించారు. 2025 ఖరీఫ్ ఈ-పంట డేటా ఆధారంగానే జిల్లాలకు నిధులు కేటాయించారు. </p>
<h3>అర్హులు </h3>
<ul>
<li>రైతులు (SC, ST, మహిళలు, ఇతరులు) అర్హులు</li>
<li>సబ్సిడీ మొత్తం గరిష్టంగా రూ.50,000 (ఒకటి లేదా రెండు యంత్రాలకు)</li>
<li>లాటరీ విధానంలో కేటాయింపు </li>
<li>రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. </li>
</ul>
<h3>సబ్సిడీ వివరాలు</h3>
<ul>
<li>ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు వ్యవసాయం యంత్రాలపై 50% సబ్సిడీ </li>
<li>చిన్న, సన్నకారు రైతులకు కూడా 50% సబ్సిడీ </li>
<li>ఇతర వర్గాల రైతులకు 40% సబ్సిడీ </li>
<li>ఒక రైతు గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే సబ్సిడీ పొందుతారు. </li>
</ul>
<h3>దరఖాస్తు విధానం ఇలా?</h3>
<p>ఏపీ సబ్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సబ్సిడీ 2026 స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. </p>
<ul>
<li>రైతు సేవా కేంద్రంను సందర్శించి వ్యవసాయ సహాయకుడిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. </li>
<li>2025 ఖరీఫ్ ఈ-క్రాప్ డేటాలో నమోదు చేసుకుని ఉండాలి. </li>
<li>అధికారులు అడిగిన పత్రాలను సమర్పించాలి. </li>
<li>దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి లాటరీ నిర్వహిస్తారు. </li>
<li>ఎంపికైన లబ్దిదారులకు సబిడ్సీ పై వ్యవసాయ యంత్రాలు అందిస్తారు. </li>
</ul>
<p>ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్, కల్టివేటర్, విత్తన జల్లే పరికరాలు, మొక్కల రక్షణ పరికరాలు, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, గడ్డి కట్టర్లు, ఫోడర్ కట్టర్లకు ఈ సబ్సిడీ లభిస్తుంది. </p>
<h3>ఎంపిక విధానం </h3>
<p>దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఆన్‌లైన్ విధానంలో లాటరీ నిర్వహిస్తారు. మండల స్థాయిలో వేర్వేరుగా లాటరీలు నిర్వహిస్తారు. ఎంపికైన లబ్దిదారులను జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి ఆమోదిస్తారు. ఈ లిస్ట్ కు వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది. ఆ లోపు రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ మొత్తం డీబీటీ రూపంలో నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ agrimachinery.nic.in లో సబ్సిడీని ట్రాక్ చేయవచ్చు.</p>
<p> </p>