<div dir="auto">Jesus statue in Yanam | కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యానాం రాజీవ్‌గాంధీ రివర్ బీచ్‌ లో అదేనండి ఫెర్రీ రోడ్ మార్గంలో జీసస్‌ స్టాట్యూను చూశారా.. బ్రెజిల్‌ రాజథాని రియో లో ఉన్న జీసస్‌ విగ్రహాన్ని పోలి నిర్మించిన ఈ స్టాట్యూను మౌంట్‌ ఆఫ్‌ మెర్సీ అనే పేరుతో 2009లో పుదుచ్చేరి ప్రభుత్వం కార్పోరేట్‌ సంస్థ(రిలయన్స్) సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసింది.. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మౌంట్‌ ఆఫ్‌ మెర్సీ స్టాట్యూ మొదటి అంతస్తులో మేరీ మాత ఆలయం కూడా ఉంటుంది.. ఇందులో క్రీస్తు గురించి విశేషాల నమూనాలు ఉంటాయి.</div>
<div dir="auto">ఇది ఆదివారం మాత్రమే తెరిచి ఉంచుతారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి చూస్తే నిలువెత్తు జీసస్‌ విగ్రహం కనిపిస్తుంది.. ఈ మౌంట్‌ఆఫ్‌ మెర్సీ మొత్తం నిర్మాణం ఎత్తు 62 అడుగుల్లో నిర్మించగా 25 అడుగుల ఎత్తులో మౌంట్‌ను పోలిన నిర్మాణం చేపట్టారు. జీసస్‌ విగ్రహం 37 అడుగుల ఎత్తులో ఉంటుంది.. ఇక క్రింది భాగంలో అయితే గుహలా ఉంటుంది.. ఇక్కడ పర్యాటకులు కూర్చునేలా ఏర్పాట్లు ఉంటుంది.. ఒకవైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గౌతమీనది సోయగం.. మరో పక్క 214 నేషనల్‌ హైవేను కలుపుతూ నదిపై నిర్మించిన బాలయోగి వారధిపై రాకపోకలు సాగించే వాహనాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి..</div>
<div dir="auto"> </div>
<div dir="auto"><strong>యానాం రివర్‌ బీచ్‌కు ఎలా వెళ్లాలంటే...</strong><br />యానాం రాజీవ్‌ గాంధీ రివర్‌ బీచ్‌ (ఫెర్రీ రోడ్‌)లో నిర్మించిన ఈ మౌంట్‌ ఆఫ్‌ మెర్సీ విగ్రహాన్ని చూడాలంటే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి 32 కిలోమీటర్లు దూరం.. అటు కాకినాడ నుంచి చేరుకోవాలంటే 31 కిలోమీటర్లు ప్రయాణిస్తే యానాం చేరుకోవచ్చు.. బస్సులు, ప్రయివేటు వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.. టెంపుల్‌ టూరిజం చేసే వాళ్లు రామచంద్రపురం మండల పరిధిలో ఉన్న ద్రాక్షారామం నుంచి కూడా యానాం సునాయాసంగా చేరుకోవచ్చు.. రామచంద్రపురం నుంచి యానాంకు కోటిపల్లి యానాం ఏటిగట్టు రోడ్డు మార్గం ద్వారా కానీ, ద్వారపూడి యానాం రోడ్డు ద్వారా కానీ కేవలం 22 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు. </div>
<div dir="auto"> </div>
<div dir="auto"><strong>ఇంకా ఎన్నో ప్రత్యేకతలు...</strong></div>
<div dir="auto"> </div>
<div dir="auto">పుదుచ్చేరీ యానాం రివర్‌ బీచ్‌లో ఇంకా ఆహ్లాదపరిచే నిర్మాణాలుచాలానే ఉంటాయి.. నిలువెత్తు సుభాష్‌ చంద్రబోస్‌, రెండు ఏనుగుల మధ్య శివలింగం, భరతమాత నిలువెత్తు విగ్రహం ఇంకా చాలా ఆకర్షనీయమైన విగ్రహాలు కనువిందుచేస్తాయి.. బీచ్‌లో ప్రశాంతమైన నదీ సోయగాలను వీక్షించేందుకు సందర్శకులు కూర్చునేలా బల్లలు కూడా ఉంటాయి.. గౌతమి నదిలో బోట్‌ ద్వారా రైడ్‌ చేయాలనుకునే వారికి అవకాశం ఏర్పాట్లుచేసింది పుదుచ్చేరీ ప్రభుత్వం.. టిక్కెట్టు తీసుకుని నదిలో బోట్‌ ద్వారా షికారు కూడా చేయవచ్చు.. </div>