<p>చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని భాకరాపేట కనుమ రహదారిపై సోమవారం భారీ ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. దట్టమైన అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల కారణంగా ఈ ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు సుమారు గంటపాటు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.</p>
<p>ఈ ఘటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే స్పందించారు. కనుమ రహదారిలో నిలిచిపోయిన వాహనాల్లో రెండు అత్యవసర అంబులెన్సులు కూడా ఉన్నట్లు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఆయన.. వెంటనే పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఆ అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీసులను ఆదేశించారు.</p>
<p>అదే సమయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, అటవీ ప్రాంతం నుంచి ఏనుగులను సురక్షితంగా అడవిలోకి తరలించేలా చర్యలు చేపట్టమన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అటవీ, పోలీస్ శాఖల అధికారులు శ్రమించి ఏనుగుల గుంపును రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తోలేశారు. అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.</p>
<p>రాత్రి వేళల్లో ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం లేదా ప్రమాదం కలగకుండా చూసేందుకు, కొద్దిరోజుల పాటు ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రత్యేక గస్తీ (పెట్రోలింగ్) నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. ఏనుగుల సంచారంపై సమాచారం అందిన వెంటనే స్పందించి, తమను సురక్షితంగా ఒడ్డున పడేసిన ఎమ్మెల్యే నానికి, అధికారులకు బస్సు ప్రయాణికులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p> </p>