<p><strong>Rahul Gandhi Scuba Diving Nicobar:</strong> కేంద్ర ప్రభుత్వం అండమాన్ దీవుల్లో చేపట్టిన 'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్' ఎంతటి విధ్వంసమో చెప్పేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త పంథాను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జరిగే పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రం లోపలి జీవావరణాన్ని చూపిస్తూ.. కేంద్రం ప్రాజెక్టుతో ఇదంతా పోతుందని చెప్పారు. కేంద్రం చేపట్టిన 'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్' స్థానిక పర్యావరణాన్ని, గిరిజన ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాహుల్ మండిపడ్డారు. </p>
<p><strong>ఇందిరా పాయింట్‌కు వెళ్లిన రాహుల్ </strong></p>
<p>రాహుల్‌గాంధీ ఇండియా సదరన్‌ టిప్ ఇందిరా పాయింట్‌ను కొన్ని రోజుల కిందట సందర్శించారు. అండమాన్ దీవుల్లో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లిన రాహుల్.. కేంద్రం అక్కడ చేపడుతున్న 'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్'కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ ప్రారంభించారు. స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజన తెగలు, మాజీ సైనికుల కుటుంబాలతో మాట్లాడారు. <br />ఈ ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. </p>
<p><strong>అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్ </strong></p>
<p>కేంద్రం తీసుకొస్తున్న ప్రాజెక్టుతో భూమిపైనే కాకుండా సముద్రంలోపల కూడా జీవ సమతుల్యత దెబ్బతింటుందని ఆరోపించారు. అండమాన్ అద్భుతమైన పగడపు దిబ్బల (coral reefs)ను కలిగి ఉందని .. ఈ ప్రాజెక్టుతో వాటి విధ్వంసం జరుగుతుందని చెప్పారు. పగడపు దిబ్బల అందాలను చూపించేందుకు.. వాటికి పొంచి ఉన్న ముప్పును స్వయంగా చూసేందుకు రాహుల్ గాంధీ సముద్రంలోకి స్కూబా డైవింగ్ చేశారు. నీటి అడుగున ఉన్న అద్భుతమైన పర్యావరణాన్ని చూపిస్తూనే, ఈ ప్రాజెక్టు వల్ల జరగబోయే నష్టాన్ని వివరిస్తూ ఆయన ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'X' లో పంచుకున్నారు.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/BLDgxBRD1EU?si=dC0vaar1BBT8WQL5" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>కేంద్రం దుశ్చర్య- పగడపు దీవులు మాయం</strong></p>
<p>ఈ ప్రాజెక్టును ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చాలా దూకుడుగా ఉందని రాహుల్ ఆరోపించారు. ప్రాజెక్టుకు అనుమతులు సాధించడం కోసం పర్యావరణ పరంగా అత్యంత కీలకమైన పగడపు దిబ్బలను అధికారిక మ్యాపుల నుంచి కావాలనే తొలగించారని రాహుల్ సంచలన ఆరోపణ చేశారు.</p>
<p><strong>కార్పోరేట్ ప్రయోజనాల కోసమే</strong><br /> <br />కేంద్ర ప్రభుత్వం స్థానిక పర్యావరణాన్ని, అక్కడి ప్రజల హక్కులను పక్కనపెట్టి కేవలం వ్యాపార, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ఈ మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.అటవీ హక్కుల చట్టాన్ని (Forest Rights Act) పూర్తిగా ఉల్లంఘిస్తూ అక్కడి గిరిజన తెగల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.<br />ప్రభుత్వం ఇక్కడ పునరావాసం కల్పించిన మాజీ సైనికుల కుటుంబాలకు (Settlers) నేటికీ సరైన నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 1.5 కోట్ల చెట్లను నరికివేయబోతున్నారని, ఇది ఊహించని పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు.</p>
<p><strong>రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తే 'ఐఎన్‌ఎస్ బాజ్'ను విస్తరించండి!</strong></p>
<p>ఈ ప్రాజెక్టును వ్యూహాత్మక, రక్షణ రక్షణ అవసరాల (Strategic and Defence Initiative) కోసమే చేపడుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను రాహుల్ గాంధీ పూర్తిగా తిప్పికొట్టారు.<br />"నిజంగా దేశ భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న భారత నావికాదళ ఎయిర్ స్టేషన్ 'ఐఎన్‌ఎస్ బాజ్' (INS Baaz) ను విస్తరించాలి. ఐఎన్‌ఎస్ బాజ్ విస్తరణ కోసం గత ఐదేళ్లుగా నౌకాదళం కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఆ పని చేస్తే మేము పూర్తి మద్దతు ఇస్తాం." అని చెప్పారు. <br />అలాగే అంతర్జాతీయ రవాణా నౌకాశ్రయం (Transhipment Port) కోసమే ఈ ప్రాజెక్ట్ కడుతున్నామనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇప్పటికే కేరళలో ఇటువంటి భారీ అంతర్జాతీయ పోర్ట్ అభివృద్ధి చెందుతోందని, కాబట్టి నికోబార్‌లో పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.</p>
<p><strong>అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు</strong></p>
<p>అభివృద్ధికి తానెప్పుడూ వ్యతిరేకం కాదని రాహుల్ స్పష్టం చేశారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసే అభివృద్ధి అవసరం లేదన్నారు. "నేను ఎల్లప్పుడూ పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధికి (Ecologically balanced development) కట్టుబడి ఉంటాను. ఈ దీవులను ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సుస్థిర పర్యాటక కేంద్రంగా (Sustainable Tourism Destination) మార్చవచ్చు. అటువంటి భారతదేశం కోసమే మనం పోరాడాలి" అని <a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a> పిలుపునిచ్చారు. </p>
<p>అండమాన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్ Green Over Greed క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. </p>