<p>Tirupati Deputy Mayor election | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన క్రమంలో రెండో రోజు అర్థరాత్రి తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, ఆయన బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళం నెలకొంది. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరడంతో తమపై దాడి చేశారంటూ ఇరు వర్గాలు ఆరోపించాయి. పరస్పర దాడి ఘటనలో రెండు వాహనాలను ధ్వంసం అయ్యాయి. <br /><strong>కార్పొరేటర్ భార్య కిడ్నాప్ యత్నం</strong><br />45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె తెలిపింది. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసులు సమక్షంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా జరిపిస్తారని నమ్మకం లేదన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు.</p>
<p><strong>వైసిపి కార్పొరేటర్లు మాకు మద్దతు తెలిపారు</strong><br />తిరుపతి: తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 22 మంది కూటమికి మద్దతు తెలిపారని, మరో 6 మంది రేపు ఉదయం వస్తారని <a title="జనసేన" href="https://telugu.abplive.com/topic/Janasena" data-type="interlinkingkeywords">జనసేన</a> నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు.</p>