<p><strong> Telangana Municipal War begins: </strong> తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచే నామిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 30వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ అవసరం అయితే 12వ తేదీన నిర్వహిస్తారు. 13వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక సంఘం నిబంధనలు ఉన్నందున, యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు .</p>
<p>ఎన్నికల ఏర్పాట్లపై రాణి కుముదిని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై ఎస్‌ఈసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. కార్పొరేషన్ అభ్యర్థులకు రూ. 10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీలకు రూ. 5 లక్షల వరకు వ్యయ పరిమితిని ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున వెంటనే క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని, మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని ఆదేశించారు </p>