<p>హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు చెక్‌పెట్టారు అధికారులు. మరో భారీ ఆపరేషన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రేవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు అనుమానం వచ్చి మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.12 కోట్లకు పైగా విలువ చేసే హైడ్రోఫోనిక్‌ గంజాయిని ఆమె లగేజీలో గుర్తించి గుర్తించి సీజ్‌ చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని ఆమె విమానంలో ఎలా తీసుకువచ్చిందా అని షాకవడం అధికారుల వంతయింది.</p>
<p>అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అధికారులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గోల్డ్, గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కొత్త మార్గాలు ఎంచుకుంటున్న వేళ, విమాన ప్రయాణాల్లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల రవాణా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దితురాలితో పాటు ఈ రవాణా వెనుక ఉన్న ముఠా గురించి సమాచారం వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.</p>
<p>ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు రోజుల్లో వేర్వేరు బ్యాగులలో 3.8 కేజీల బంగారం లభ్యం కావడం కలకలం రేపింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, కడపకు చెందిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేయడంతో దొరికిపోతామనే భయంతో బ్యాగులు అక్కడే వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన అధికారులు మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రూ.3.6 కోట్ల విలువైన బంగారం ఒకరు లగేజీలో పెడితే, మరొకరు ఐరన్ బాక్సులో దాచి స్మగ్లింగ్ చేయాలని చూసి దొరికిపోయాడు.</p>