<p><strong>Pithapuram News:</strong> ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య‌శాఖలో నిర్ల‌క్ష్యం ఆవ‌హిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ ద‌గ్గ‌ర నుంచి పేషెంట్ల‌ను ప‌ట్టించుకోవ‌డం వ‌ర‌కు నిర్ల‌క్షంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. తునిలో పేషెంట్ కాలు సర్జరీ చేసి స‌ర్జిక‌ల్ బ్లేడు ఉంచి ఆప‌రేష‌న్ పూర్తి చేసిన ఘ‌ట‌న, ఇప్పుడు పిఠాపురంలో పీహెచ్‌సీ ఘటన ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప్రాథమిక ఆరోగ్య‌ కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ నిండిప్రాణం బ‌లైపోయిందని స్థానికులు చెబుతున్నారు. గుండెనొప్పితో ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చిన వ‌స్తే ఆసుప‌త్రిలో ఎవ్వ‌రూ లేక తాళం వేసి ఉందని అంటున్నారు. ప్రాధ‌మిక చికిత్స అంద‌క ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే ఆ వ్యక్తి కుప్ప‌కూలి మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం చేబ్రోలులో చోటుచేసుకుంది.</p>
<p>పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం చేబ్రోలులో పీహెచ్‌సీలో వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల గ‌తంలో బాలింత మృతిచెందింది. ఈ పీహెచ్‌సీలోనే మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. చేబ్రోలు పీహెచ్‌సీ వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి గుండె నొప్పి అని ఆసుప‌త్రికి వ‌స్తే తాళాలు వేసి ఉన్నాయి. 108కి ఫోన్ చేస్తే స‌కాలంలో రాలేదు. దీంతో అక్క‌డే కుప్ప‌కూలి మృత్యువాత ప‌డ్డాడు. </p>
<h3>అస‌లేం జ‌రిగిందంటే..</h3>
<p>కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున గుండెపోటు బారిన ప‌డిన ఓ వ్య‌క్తిని ద‌గ్గ‌ర్‌లో ఉన్న చేబ్రోలు పీహెచ్‌సీకు తీసుకుని వ‌చ్చారు. పీహెచ్ సీలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108కు ఫోన్ చేశారు. అదికూడా స‌కాలంలో రాలేదు. దీంతో ఆసుప‌త్రి వ‌ద్ద ఆవ‌ర‌ణ‌లోనే ప్రాణాలు కోల్పోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ విచారణకు ఆదేశించారు. </p>
<p>స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు గ్రామానికి చెందిన ఇమ్మంది మాణిక్యం (56) గొల్లప్రోలు శివారు ఈబిసి కాలనీలో గల ఒక హోటల్లో పనిచేస్తుంటాడు. భార్య పిల్లలు లేకపోవడంతో ఇతడు హోటల్లోనే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి మాణిక్యానికి గుండెపోటు రావడంతో హోటల్లో పనిచేసే వర్కర్లు చేబ్రోలు పి హెచ్ సి కి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడం, ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో 108కి ఫోన్ చేసారు. అంబులెన్స్ రావడానికి గంటకుపైగా సమయం పట్టడంతో మాణిక్యం నొప్పి భరించలేక ఆసుపత్రి ఆవరణంలోనే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు. </p>
<p>తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చేబ్రోలు ఆసుపత్రి వద్దకు చేరుకున్న108 సిబ్బంది రోగిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు ద‌క్కేవ‌ని మృతిని బంధువులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గడచిన కొంతకాలంగా పీహెచ్సీలో రాత్రి సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండ‌క‌పోగా తాళాలు వేసి ఉంచుతున్నార‌ని, దీనివల్ల అత్యవసర వైద్యానికి వ‌స్తున్న గ‌ర్భ‌ణీలు కూడా ఇబ్బందులు పడుతున్నార‌ని గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉండవలసిన నలుగురు సిబ్బంది డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తుంది. </p>
<h3>పీహెచ్‌సీ వైద్యాధికారి స‌స్పెన్ష‌న్‌..</h3>
<p>విధులు పట్ల నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణపై చేబ్రోలు పిహెచ్ సి వైద్యాధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.వైద్యం అందగా రోగి మృతి చెందిన ఘటనపై చేబ్రోలు పీహెచ్సి లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ మంగళవారం విచారణ నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న‌కు ప్రాథ‌మిక బాధ్యులుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి రతన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో తాళ్లరేవు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ ను డిప్యూటేషన్ పై నియమిస్తున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్స్ కు షోకాజు నోటీసు ఇచ్చినట్లు వివరించారు. </p>
<p>గ‌త కొంత కాలంగా చేబ్రోలు పిహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటుంద‌ని గ్రామ‌స్తులు, జ‌న‌సేన నాయ‌కులు వైద్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌కు తెలిపారు. ఇక్క‌డ ఒక వైద్యుడు, ఒక న‌ర్సు మాత్ర‌మే సేవ‌లందిస్తుండా మిగిలిన వారు డిప్యూటేష‌న్ల‌పై మ‌రో చోట ప‌నిచేస్తున్నారు. దీంతో చేబ్రోలు పీహెచ్‌సీలో వైద్య‌సేవ‌లు అక్క‌ర‌కు రాకుండాపోతున్నాయ‌ని గ్రామ‌స్తులు మండిప‌డుతున్నారు.. </p>