<p><strong>Manmohan Singh Death:</strong>మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధతత చాటుకొని రాజకీయ నాయకులకు రోల్‌మోడల్‌గా నిలించారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, భార్య గురుశరణ్ కౌర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. </p>
<p>మాజీ ప్రధాని చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు, చాలా తక్కువగా మాట్లాడేవారు. ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే... ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఢిల్లీ, చండీగఢ్‌లో ఆయనకు ఫ్లాట్ ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్ కు ఎలాంటి అప్పులు లేవు.</p>
<p><strong>డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు</strong></p>
<p>డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న నాటి పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు. </p>
<p>1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా చేరారు. తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా; ప్రధానమంత్రికి సలహాదారుగా; యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా ఏ పదవిలో చేరిన అక్కడ తన బెస్ట్ ఇవ్వడం మన్మోహన్ సింగ్‌కు చెల్లింది. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పని చేశారు. అప్పుడే అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవి నేటికి ఆదర్శంగా మారాయి. </p>