<p><strong>Sathyasai District Politics:</strong> శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో నిరుపేద ముస్లింల కోసం దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ షాదీ మహల్‌కు ఎమ్మెల్యే తాళాలు వేయడం తీవ్ర దుమారం రేగుతోంది. 1994లోనే నాటి ఎమ్మెల్యే దివంగత జొన్నా సూర్యనారాయణ చొరవతో, లారీ యజమానుల అసోసియేషన్ స్థలంలో నిర్మించిన ఈ భవనం వేలాది మంది ముస్లిం కుటుంబాల శుభకార్యాలకు అండగా నిలిచింది. అయితే, గతంలో తాను కూడా ఈ భవన నిర్మాణానికి కొంత చందా ఇచ్చాననే సాకును చూపిస్తూ, ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆ ప్రభుత్వ ఆస్తినే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఈ షాదీ మహల్‌కు తాళాలు వేసి తన అధీనంలో ఉంచున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. </p>
<p><strong>మైనార్టీలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు అనే ఆరోపణలు </strong></p>
<p>ఈ తాళాల వివాదం వెనుక కేవలం ఆస్తి తగాదా మాత్రమే లేదు.. దీని వెనుక ముస్లిం మైనారిటీలపై సాగుతున్న కక్షసాధింపు రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే ఏకైక కోపంతోనే ప్రభుత్వ భవనానికి తాళాలు వేయించారని ప్రణీత్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల గత రెండేళ్ల కాలంలో దాదాపు 500 మందికి పైగా నిరుపేద ముస్లిం కుటుంబాలు తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకునే మహత్తర అవకాశాన్ని కోల్పోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. సమాజంలో గుడులు, మసీదులు, పాఠశాలల నిర్మాణానికి దాతలుగా చందాలు ఇవ్వడం ఆనవాయితీ అని, అంతమాత్రాన చందాలు ఇచ్చిన వారే ఆయా ప్రజా ఆస్తులకు యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయాలనుకోవడం చట్టవిరుద్ధమని ప్రణీత్ రెడ్డి మండిపడుతున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రభుత్వ భవనాన్ని తిరిగి ఓపెన్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. </p>
<p><strong>ఆలయ స్థలాన్ని పార్కింగ్ కోసం వాడుకుంటున్న ఎమ్మెల్యే</strong></p>
<p>కదిరిలో రేగుతున్న ఈ కబ్జా పర్వం కేవలం షాదీ మహల్‌కే పరిమితం కాలేదు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్న ల్యాండ్ గ్రాబింగ్ సంస్కృతికి ఇది అద్దం పడుతోంది. పట్టణంలోని మసీదులు, గుడులు, చర్చిలు, చివరకు మైనారిటీల సమాధి స్థలాలను సైతం వదలకుండా ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారని వైసీపీ నేతలు చేస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే తన నివాసానికి సరిగ్గా ఎదురుగా ఉన్న, కోట్లాది రూపాయల విలువైన ప్రసిద్ధ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్థలాన్ని గత పదేళ్లుగా అక్రమంగా కబ్జా చేసి, తన సొంత అవసరాల కోసం ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారనే ఉదంతాన్ని ప్రణీత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. దేవుడి భూములను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడం మంచిది కాదని, నరసింహస్వామి ఆగ్రహానికి గురైన వారెవరూ రాజకీయంగా నిలబడలేరని హెచ్చరిస్తూ ఆ స్థలాన్ని వెంటనే దేవాదాయ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. </p>
<p><strong>ప్రసాద్ స్కీమ్‌లో ప్రసాద్ స్కామ్ ? </strong></p>
<p>మరోవైపు, కదిరి నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పేరుతో సాగుతున్న ప్రచారం వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యూహం దాగి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ ద్వారా కదిరి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని చెప్తూ, సూటు బూటు వేసుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే అసలు ఉద్దేశం కదిరిని రక్షించడం కాదని, ఆ ప్రాజెక్టు వెనుక వందల కోట్ల ప్రసాద్ స్కామ్ చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర నిధుల ముసుగులో సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. </p>
<p><strong>విచారణలకు వైసీపీ నేతల డిమాండ్ </strong></p>
<p>రాజకీయ అధికారమంటే ప్రజల ఆస్తులను దోచుకోవడం, ప్రశ్నించిన విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కాదని.. ఇటువంటి బెదిరింపులకు కదిరిలో ఎవరూ భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ప్రణీత్ రెడ్డి స్పష్టం చేశారు. పేద ముస్లింల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన షాదీ మహల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు, అలాగే ఆలయ భూములను కబ్జాకోరుల నుంచి విముక్తి చేసే వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరంతరాయంగా క్షేత్రస్థాయి పోరాటాలు చేస్తాయని అంటున్నారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/mobiles/here-are-the-precautions-to-take-to-prevent-mobile-phones-from-exploding-250188" width="631" height="381" scrolling="no"></iframe></p>
<p> </p>