<p>BTech Student Arrested | ఇబ్రహీంపట్నం: హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినిపై ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. నమ్మి వెంట వెళ్లిన స్నేహితురాలికి మద్యం తాగించి, లైంగిక దాడి చేశాడు. బాధితురాలు ధైర్యం ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.</p>
<p>ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్‌ ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మే 14న తేదీన రాత్రి తన క్లాస్‌మేట్‌ అయిన ఒక యువతిని టీ తాగడానికి వస్తావా అని పిలిచి, తన కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అనంతరం వారు కారులో ఇబ్రహీంపట్నం తిరిగి వస్తున్న సమయంలో ఉదయ్ మద్యం కొనుగోలు చేశాడు. </p>
<p>తన ప్లాన్ ప్రకారం బీడీఎల్‌ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి కారును తీసుకెళ్లి, అక్కడ విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి వెళ్లాక, ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి కారులో తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మే 17న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ఉడుతల ఉదయ్‌ను సోమవారం నాడు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.</p>
<p><strong>ఉరేసుకుని నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య..</strong></p>
<p>తీవ్రమైన తలనొప్పిని భరించలేక ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. దంతాలపల్లి ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊడ్గుల గౌరయ్య, సోమక్క దంపతుల చిన్న కుమార్తె ఊడ్గుల దివ్య (21) వరంగల్‌లోని ఒక కాలేజీలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. 4 రోజుల క్రితమే ఆమె పెద్దముప్పారంలోని తన ఇంటికి వచ్చింది.</p>
<p>దివ్య గత కొంతకాలం నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పి తీవ్రతను భరించలేక ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం నాడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటలో ఆసుపత్రికి తరలించారు.</p>
<p>తల్లిదండ్రులు దివ్యకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇలా జరగడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె ఆత్మహత్యపై తండ్రి గౌరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.</p>
<p> </p>