<p><strong>Delhi Election :</strong> దాదాపు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. పోటీ చేసిన 68 సీట్లలో 48 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆప్ 22 సీట్లతో సరిపెట్టుకుంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP) అఖండ విజయాన్ని నమోదు చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన మిత్ర పక్షాలకు బురారి, డియోలి అనే రెండు సీట్లను కేటాయించింది. జనతాదళ్ (యునైటెడ్) బురారి నుండి శైలేంద్ర కుమార్‌ను నిలబెట్టగా, ఎల్‌జేపీ (రామ్ విలాస్) డియోలి నుండి దీపక్ తన్వర్‌ను నామినేట్ చేసింది. </p>
<p><strong>ఎన్నికల్లో మిత్రపక్షాలకు తప్పని ఓటమి</strong></p>
<p>బురారి స్థానంలో జేడీ(యూ) అభ్యర్థి శైలేంద్ర కుమార్ ఆప్ అభ్యర్థి సంజీవ్ ఝా చేతిలో 20,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో, కాంగ్రెస్ అభ్యర్థి మంగేష్ త్యాగి 19,920 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక డియోలిలో, ఆప్ అభ్యర్థి ప్రేమ్ చౌహాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి దీపక్ తన్వర్‌ను 36,680 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ చౌహాన్ 74,678 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. </p>
<p>ఈ రెండు స్థానాలు పూర్వాంచల్ ఆధిపత్యంలో ఉన్నాయి. బీజేపీ వలసదారుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఈ రెండు సీట్లను తన మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీహార్‌లోనూ ఎన్డీయే మిత్రపక్షాలకు రెండు సీట్లు కేటాయించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) పూర్వాంచల్ ఆధిపత్య స్థానాలైన బురారి, సంగం విహార్‌లలో పోటీ చేసింది. మరో పక్క ఎన్డీయే మిత్రపక్షం అజిత్ పవార్ నేషనలిస్ట్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ (NCP) కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. ఢిల్లీలో సీటు గెలవలేకపోయింది. <br /> <br />ఢిల్లీ ఎన్నికల కోసం ఎన్‌సీపీ 30 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో భాగంగా న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాల నుండి అభ్యర్థులను బరిలోకి దింపింది. గతంలో ఎన్‌సీపీ ఢిల్లీలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే, జూలై 2023లో ఎన్‌సీపీ విడిపోయిన తర్వాత అజిత్ పవార్ వర్గం ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. పలు నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని మరో ఎన్డీయే మిత్రపక్షం, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా ఒక సీటును కోరుకున్నారు. కానీ ఆ సీటును సైతం గెలుచుకోలేకపోయారు. ఓట్ల శాతం పరంగా, మొత్తం ఓట్లలో 45 శాతంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 1.07% ఓట్లను పొందగా, ఎల్జేపీ (రామ్ విలాస్) 0.53% ఓట్లను పొందగా, ఎన్‌సీపీ 0.06% ఓట్లను మాత్రమే పొందగలిగింది.</p>
<p><strong>దేశంలో బీజేపీ హవా</strong></p>
<p>దేశంలో బీజేపీ హవా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కమల వికాసం కొనసాగుతోంది. ఇప్పటివరకూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 15కు చేరింది. ఎన్డీఏకో కలుపుకుంటే మొత్తం 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక బీజేపీ మిత్రపక్షాలైనా ఎన్డీఏ పార్టీలు కూడా పలు రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. వాటిలో ఏపీ కూడా ఒకటి… గతేడాది జరిగిన ఎన్నికల్లో <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> మరో నాలుగు నెలల్లో ఏడాది పూర్తి చేసుకోనున్నారు.</p>
<p><strong>Also Read : <a href="https://telugu.abplive.com/news/india/delhi-elections-results-2025-bjp-weaks-aap-by-targets-manish-sisodia-197193">Manish Sisodia: మోదీకి అమిత్ షా! కేజ్రీవాల్‌కు సిసోడియా- మాస్టర్ మైండ్‌ను సైలెంట్ చేసి ఆప్ ను గద్దె దింపేశారు</a></strong></p>