<p><strong>Man Dragged by Crocodile In Saryu River: </strong> ఉత్తరప్రదేశ్‌లోని గొండా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్త అంత్యక్రియల కోసం వచ్చిన అల్లుడు.. నదిలో స్నానం చేస్తుండగా ఒక భారీ మొసలి దాడికి గురయ్యాడు. ఘాట్ వద్ద వందలాది మంది చూస్తుండగానే, కనురెప్పపాటు కాలంలో ఆ మొసలి అతడిని నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. </p>
<p><strong> అంత్యక్రియల సాయం చేసి.. చేతులు కడుక్కోబోతుండగా!</strong></p>
<p>గ్రేటర్ నోయిడాలోని సిగ్మా పరిచౌక్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల దీపక్ శర్మ ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గొండా జిల్లా ఉమ్రి బేగంగంజ్ గ్రామంలో ఉంటున్న ఆయన అత్తగారు ఉర్మిలా దేవి అకస్మాత్తుగా మరణించడంతో.. దీపక్ బుధవారం ఉదయమే తన భార్య రేఖ, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి కారులో అత్తగారింటికి చేరుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియల కోసం సరయూ నదీ తీరంలో చితిని సిద్ధం చేసే పనుల్లో, గుంతలు తవ్వడంలో దీపక్ చురుగ్గా సాయం చేశాడు. ఆ పనులు ముగిసిన తర్వాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని, స్నానం చేయడానికి నదిలోకి దిగాడు.</p>
<p><strong> హెచ్చరించిన స్థానికులు.. సెకన్లలోనే ఘోరం!</strong></p>
<p>సరయూ నదిలోని ఆ ప్రాంతంలో మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందని, లోపలికి వెళ్లవద్దని అక్కడే ఉన్న స్థానికులు, మత్స్యకారులు దీపక్‌ను గట్టిగా హెచ్చరించారు. అయితే, ఆ మాటలను పెద్దగా పట్టించుకోని దీపక్.. నీటిలోకి దిగి కొద్దిగా ముందుకు వంగి ముఖం కడుక్కోబోయాడు. సరిగ్గా అదే సమయంలో నీటి అడుగు నుంచి అకస్మాత్తుగా పైకి దూసుకొచ్చిన ఒక భారీ మొసలి, ఒక్క ఉదుటన దీపక్ తల భాగాన్ని తన బలమైన దవడలతో కరచి పట్టుకుంది. తీరంలో ఉన్న బంధువులు, గ్రామస్థులు భయంతో కేకలు వేస్తూ రక్షించేందుకు పరుగెత్తే లోపే.. ఆ మొసలి దీపక్‌ను నది నడిబొడ్డున ఉన్న లోతైన నీటిలోకి లాక్కెళ్లిపోయింది.</p>
<p><strong> 24 గంటల తర్వాత లభ్యమైన దేహం</strong></p>
<p>ఈ ఘోరం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ విపత్తు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక మత్స్యకారులు, స్కూబా డైవర్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా వెతికిన అనంతరం.. గురువారం మధ్యాహ్నం ఘటనా స్థలానికి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో దీపక్ శర్మ మృతదేహాన్ని మొసలి కొరికిన గాయాలతో డైవర్లు వెలికితీశారు.</p>
<p><strong> గ్రామంలో తీరని శోకం</strong></p>
<p>ఏడేళ్ల క్రితం వివాహమై, ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. అటు తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న భార్య రేఖ.. ఇటు కళ్ల ముందే భర్త కూడా మొసలి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో స్పృహతప్పి పడిపోయింది. నదీ తీర ప్రాంతాల్లో మొసళ్ల ముప్పు పొంచి ఉన్నందున, పుణ్యస్నానాలు లేదా కర్మకాండల కోసం నదిలోకి దిగేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతైన జలాల్లోకి వెళ్లవద్దని జిల్లా అధికారులు, పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/if-you-have-2-pan-cards-be-prepared-for-this-punishment-247945" width="631" height="381" scrolling="no"></iframe></p>
<p> </p>