<p>మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది పిల్లల మరణానికి సంబంధించిన కేసులో ఓ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సూచించిన Coldrif దగ్గు సిరప్ తాగి వారు మరణించినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో డాక్టర్ ప్రవీణ్ సోనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆయన అదుపులోకి తీసుకున్నారు.</p>
<p><strong>శ్రీసన్ ఫార్మాసుటికల్ కంపెనీపై కేసు</strong><br />Coldrif దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లల కిడ్నీలు పాడైపోయి వారు చనిపోయినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆ మందును రికమండ్ చేసిన డాక్టర్ సోనీతోపాటు దాన్ని తయారు చేస్తున్న Sresun Pharmaceuticals నిర్వాహకులపై పరాసియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ అంకిత్ సహ్లామ్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా డాక్టర్తోపాటు స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపైనా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27(ఎ)తోపాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 105, 276 కింద డాక్టర్ సోని, Coldrif సిరప్ తయారీదారు గతంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదైంది.</p>
<p><strong>సిరప్ తాగి కిడ్నీ వైఫల్యం కారణంగానే మృతి</strong><br />ఈ నేపథ్యంలోనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆరు రాష్ట్రాల్లోని దగ్గు సిరప్‌లు, యాంటీబయాటిక్స్‌తో సహా 19 ఔషధాల తయారీ యూనిట్లలో రిస్క్-ఆధారిత తనిఖీలను ప్రారంభించింది. కల్తీ సిరప్‌లు విచ్చలవిడిగా తయారవుతున్నాయని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్య దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఔషధాల నాణ్యత, భద్రతను అంచనా వేయడం ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం. తనిఖీలు పూర్తి చేసిన CDSCO కల్తీ సిరప్లతో కిడ్నీ వైఫల్యం కారణంగానే 14 మంది పిల్లలు మరణించారని నివేదికలు సమర్పించింది.</p>
<p><strong>ప్రామాణిక నాణ్యత లేనిది</strong><br />Coldrif సిరప్ను చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలో తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ పరీక్షించింది. ‘ప్రామాణిక నాణ్యత లేనిది’ అని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన Coldrif సిరప్ కల్తీ అయినట్లు అక్టోబర్ 2న ప్రకటించింది. దీంతోపాటు ఈ సిరప్లో diethylene glycol (48.6% w/v) ఉన్నట్లు గుర్తించింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే విషపూరితమైనదని, ఆరోగ్యానికి హానికరమని వెల్లడించింది.</p>
<p><strong>Coldrif అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశం</strong><br />దీంతో అప్రమత్తమైన మధ్యప్రదేశ్, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం నుంచి Coldrif మరియు Nextro-DS దగ్గు మందు సిరప్‌ల అమ్మకాన్ని నిషేధించాయి. రాష్ట్రవ్యాప్తంగా Coldrif అమ్మకం, పంపిణీని వెంటనే నిలిపివేయాలని మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 ప్రకారం.. దర్యాప్తు కోసం అందుబాటులో ఉన్న మొత్తం స్టాక్ను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. తదుపరి పరీక్ష జరిగే వరకు శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ యొక్క అన్ని ఇతర ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని ఆ శాఖ ఆదేశించింది.</p>
<p>పిల్లల మృతి ఘటన ఎంతో ఎంతో విషాదకరమైనదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. Coldrif సిరప్ అమ్మకాన్ని మధ్యప్రదేశ్ అంతటా నిషేధించినట్లు తెలిపారు సిరప్ తయారు చేసే కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించామని Xలో పోస్ట్ చేశారు.</p>
<p><strong>Coldrifను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం</strong><br />మధ్యప్రదేశ్తోపాటు రాజస్థాన్ లోనూ ఒకే ఔషధంతో మరణాలు సంభవించాయని అనుమానాలు వ్యక్తమవుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం నుంచి Coldrifను నిషేధించింది. పిల్లల మరణానికి సంబంధించి Coldrif పరీక్షా ఫలితాలు శనివారం రాగా.. Nextro-DS రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.</p>