<p>ఛత్తీస్‌గఢ్‌: కాంకేర్ జిల్లాలోని ధమ్తారి, ఒడిశా సరిహద్దులో ఆదివారం ఉదయం భద్రతా దళాలు.. నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. ఇద్దరు పురుష , ఒక మహిళా నక్సలైట్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక SLR, ఒక 303 రైఫిల్, 12-బోర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎల్లిసెల ఈ విషయాన్ని ధృవీకరించారు.</p>
<p>కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తియార్పాని అడవుల్లో ఎన్‌కౌంటర్ సమాచారం మేరకు కాంకేర్ డిఆర్‌జి, బిఎస్‌ఎఫ్, గరియాబంద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో తలదాచుకుని ఉన్న నక్సలైట్లు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. అడవిలో మరింత మంది నక్సలైట్లు దాగి ఉండవచ్చని పోలీసులు, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో అడపాదడపా కాల్పుల మోత కొనసాగుతోంది.</p>
<p>మరణించిన ముగ్గురు నక్సలైట్లలో సీతానది ఏరియా కమిటీ కమాండర్ శ్రావణ్ ధీర్, నగరి ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ రాజేష్ ఉన్నారు. శ్రవణ్‌పై 8 లక్షలు రివార్డు ఉండగా, రాజేష్, బసంతిలపై 5 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>