<p><strong>Asia Cup 2025 Latest News : </strong>ఆసియాక‌ప్ లో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డిన‌ట్లే తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ ఫైన‌ల్లో పాకిస్థాన్ ను ఓడించిన ఇండియా విజేతగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక క‌ప్పుతో పాటు విన్న‌ర్ మెడ‌ళ్లను టీమిండియాకు అప్ప‌గించకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహిసిన్ న‌ఖ్వి త‌నతోపాటే తీసుకెళ్లాడు. అయితే అన్ని వైపులా ఒత్తిడి రావ‌డంతోపాటు ఏసీసీ చీఫ్ గా న‌ఖ్వి ప‌ద‌వీచ్యుతి కోసం రెస‌ల్యూష‌న్ తీసుకొస్తామ‌ని చెప్ప‌డంతో న‌ఖ్వి.. కాస్త వెనుకంజ వేసిన‌ట్లు తెలుస్తోంది. క‌ప్పు, మెడ‌ళ్ల‌ను టోర్నీ ఆతిథ్య బోర్డు యూఏఈకి అప్ప‌గించి, త‌ను సొంత‌దేశం పాక్ కు వెళ్లుతున్న‌ట్లు స‌మాచారం. </p>
<p><strong>పొలిటిక‌ల్ మైలైజీ కోసం..</strong><br />ఇక ఇండియా, పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను క్యాష్ చేసుకుని త‌న పొలిటిక‌ల్ మైలేజీ పెంపు కోస‌మే న‌ఖ్వి ఇలా చేశాడ‌ని తెలుస్తోంది. పాక్ హోం మినిస్ట‌ర్ అయిన న‌ఖ్వి.. రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ఉండాల్సింది పోయి, భార‌త్ ను ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించాడ‌ని అత‌ని వ్య‌వ‌హార‌శైలిని బ‌ట్టి గ‌మ‌నించ‌వ‌చ్చు. పాక్ లో ఇండియన్ టీమ్ ను ఇబ్బంది పెట్టి, త‌న వ్య‌క్తిగ‌త మైలేజీని పెంచుకోవాలని త‌ను భావించాడు. ఇక ఈ విష‌యంలో బీసీసీఐ పెద్ద‌లు .. ఇప్ప‌టికే అత‌నితో స‌మావేశ‌మైన‌ప్ప‌టికీ ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది. ఆ సమావేశంలో నఖ్వి, బీసీసీఐ సభ్యుల మధ్య చర్చ జరిగింది. అయితే తన ఆఫీస్ కు వచ్చి, ట్రోఫీ తీసుకోవాల్సిన నఖ్వీ సూచించగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. ఈ సమావేశంలో బోర్డు నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశీష్ పాల్గొన్నారు. </p>
<p><strong>ఐసీసీ వ‌ద్ద తేల్చుకోనున్న‌..</strong><br />చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఒక ప్రాంతీయ బోర్డు చైర్మ‌న్ .. ఒక దేశానికి వ‌త్తాసు ప‌లికే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నఖ్వి వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే ఐసీసీకి ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అలాగే వ‌చ్చేనెల‌లో జ‌రిగే స‌మావేశంలో ఈ విష‌యాన్ని తేల్చుకోవాల‌ని బోర్డు ప‌ట్టుద‌ల‌గా ఉంది. మ‌రోవైపు త్వ‌ర‌లోనే యూఏఈ బోర్డు నుంచి క‌ప్పుతోపాటు మెడ‌ళ్ల‌ను బీసీసీఐ సొంతం చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఎన్న‌డూ లేని విధంగా ఈసారి దాయాదులు ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు ఉద్రిక్తంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మూడుసార్లు జ‌రిగిన ఈ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలిచి హ్యాట్రిక్ సాధించ‌డంతోపాటు అజేయంగా నిలిచి క‌ప్పును సొంతం చేసుకుంది. ఓవ‌రాల్ గా ఇది ఇండియాకు తొమ్మిదో ఆసియాక‌ప్పు టైటిల్ కావ‌డం విశేషం. </p>