ARTICLE AD
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ తనది పెద్ద మనసు అని మరోసారి నిరూపించారు కష్టాల్లో ఉన్న తోటి సినీ కార్మికులను ఆదుకోవడంలో తనకు తానే సాటి అని చాటుతూ వారం వ్యవధిలోనే ఇద్దరు బాధితులకు సుమారు 20 లక్షల భారీ ఆర్థిక సాయం అందించారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి 10.5 లక్షలు, అలాగే తన మాజీ మేనేజర్ నరసయ్య భార్య బైపాస్ సర్జరీ కోసం 9.5 లక్షల మొత్తాన్ని తక్షణమే అందజేసి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. కేవలం ధన సహాయంతో ఆగకుండా సర్జరీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు.
దశాబ్దాలుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అన్నయ్య కరోనా వంటి విపత్కర సమయాల్లోనూ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా వేలాది ప్రాణాలను కాపాడారు. తన వద్ద పనిచేసే వారు లేదా పరిశ్రమకు చెందిన కార్మికులు ఆపదలో ఉన్నారని తెలిస్తే స్పందించే ఆయన గుణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారానికి, ఇటువంటి నిరంతర సేవా కార్యక్రమాలతో చిరంజీవి మరింత గౌరవాన్ని తెస్తున్నారని అటు అభిమానులు, సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`లో నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాతో పాటు దర్శకుడు బాబీతో మరో కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు స్టార్ హీరోగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు కష్టాల్లో ఉన్నవారికి పెద్ద దిక్కుగా నిలిచి రియల్ హీరోగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

1 hour ago
1