<p><strong>YCP confusing strategies: </strong>వైఎస్ఆర్‌సీపీలో సీరియస్ గా ఒకే స్ట్రాటజీని కంటిన్యూ చేసే మెకానిజం మిస్ కావడంతో ఆ పార్టీలో గందరగోళం ఏర్పడుతోంది. రాజధాని అమరావతి నుంచి పరిశ్రమల వరకూ అన్ని విషయాల్లోనూ ఓ విధానాన్ని బలంగా చెప్పలేకపోతోంది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ తమ పనితనమేనని.. టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ అనూహ్యంగా కోర్టులో తమ ఎంపీతో గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం సంచలనంగా మారింది. కోర్టు స్పందన ఎలా ఉన్నా వైసీపీ తీరు మాత్రం ప్రజల్లో చర్చకు కారణం అయింది. పాత విషయాలపైనా ఇలాగే వ్యవహరించిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.</p>
<p><strong>రాజకీయ పార్టీల వ్యూహాల్లో గందరగోళం ఉండకూడదు! </strong><br /> <br />వైఎస్ఆర్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీలో ప్రస్తుతం ఒక స్పష్టమైన, స్థిరమైన వ్యూహం లోపించడం ఆ పార్టీ ఉనికికే సవాల్‌గా మారుతోంది. గత ఐదేళ్ల పాలన నుంచి నేటి వరకు కీలక అంశాలపై ఒకే మాట మీద నిలబడలేకపోవడం, పూటకో రకమైన వాదనలను తెరపైకి తీసుకురావడం క్యాడర్‌తో పాటు సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ అధినేత జగన్ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో పార్టీ తీసుకునే చర్యలకు మధ్య పొంతన లేకపోవడం వల్ల రాజకీయంగా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడుతోంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై వైసీపీ అనుసరిస్తున్న తీరు ఇందుకు తాజా ఉదాహరణ. ఒకవైపు ఈ ప్రాజెక్టు తమ హయాంలోనే వచ్చిందని, <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> అనవసరంగా క్రెడిట్ కొట్టేస్తోందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. అయితే, అదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ కేటాయింపులకు వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన ఎంపీ కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మా హయాంలోనే వచ్చింది అని చెబుతూనే, దానిని అడ్డుకునేలా న్యాయపోరాటం చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందvf ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. </p>
<p><strong>అమరావతిపైనా అదే గందరగోళ వ్యూహం </strong></p>
<p>కేవలం ఐటీ రంగమే కాదు, రాజధాని అమరావతి విషయంలోనూ వైసీపీ ఇమేజ్ ఇప్పటికే దెబ్బతింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల మంత్రాన్ని పఠించడం ఆ పార్టీ రాజకీయ నిలకడను ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు మళ్ళీ అమరావతిపై అడపాదడపా చేస్తున్న వ్యాఖ్యలు, కోర్టు తీర్పులపై మారుతున్న వాదనలు ప్రజల్లో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. ఏ ఒక్క విషయంపై కూడా ఒకే విధానానికి కట్టుబడి ఉండలేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. </p>
<p><strong>సలహాదారులు, అధినేత మధ్య కమ్యూనికేషన్ గ్యాప్?</strong></p>
<p>వైసీపీలో ఉన్న సీనియర్ సలహాదారులు, మేధావుల అభిప్రాయాలకు, <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> తీసుకునే నిర్ణయాలకు మధ్య భారీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన సలహాదారులు, క్షేత్రస్థాయి పరిణామాలను అధినేతకు సరిగ్గా వివరించడంలో విఫలమవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకునే లోపే, మరో వివాదాస్పద నిర్ణయం బయటకు రావడం వల్ల పార్టీ ఇమేజ్ ప్రజల్లో పలుచన అవుతోంది. రాజకీయాల్లో విధానాల మార్పు సహజమే అయినా, అది నమ్మశక్యంగా ఉండాలి. కానీ, అభివృద్ధి ప్రాజెక్టులను ఒకవైపు తమవి అని చెప్పుకుంటూనే, మరోవైపు అడ్డుకోవడం వంటి చర్యలు పార్టీ పతనావస్థకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యల వల్ల భవిష్యత్తులో వైసీపీ ఏ విషయాన్ని సీరియస్‌గా చెప్పినా, ప్రజలు దానిని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండదన్న ఆందోళన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/health/do-you-know-where-there-are-women-who-are-able-to-have-children-even-at-the-age-of-65-240574" width="631" height="381" scrolling="no"></iframe></p>
<p> </p>