<div><strong>Crime News:</strong> పుణె( Pune)లో సమీపలోని విధాని గ్రామం సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తల నుంచి మొండెం వేరువేరుగా ఉన్న మహిళ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఓ చెరుకు తోట సమీపంలో ఛిద్రమైన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.అయితే ఆమె తల, మొండెం కింది భాగాలు మాత్రమే ఉన్నాయని... మొండి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.</div>
<div> </div>
<div><strong>ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం </strong></div>
<div>మహారాష్ట్ర(Maharastra)లోని పుణెకు సమీపంలోని సతారా జిల్లాలోని విధాని అనే గ్రామంలో ఒళ్లుగగుర్పొడిచే ఓ దృశ్యం గ్రామస్థుల కంటపడింది. తల తెగిపడిన శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసుల(Police)కు సమాచారం ఇచ్చారు. ఓ చెరుకు తోట సమీపంలో మహిళ శరీర భాగాలు కనిపించాయి.అప్పటికే ఆ మృతదేహాం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే అక్కడ కేవలం మహిళ తల, మొండెం కింద ఉండే కొన్ని భాగాలు మాత్రమే ఉన్నాయి. మొండెం మాత్రం కనిపించడం లేదు. తల తెగనరికి మొండెం వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మెండెం నుంచి శరీరం కిందభాగంలోని కొన్ని అవయవాలను మాత్రమే గుర్తించినట్లు ఫాల్తాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ తెలిపారు. చేతబడి (Black Magic)కోసమే మహిళను అంతమొందించి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మూడనమ్మకాలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ అని వారు వివరించారు. తల నుంచి మొండెం వేరు చేసి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా చేతబడి కోసమేనని అక్కడి స్థానికులు చెప్పారు.</div>
<div>మూడనమ్మకాలతో చేతబడి నెపంతో మహిళను హత్య చేసి మొండెం తీసుకెళ్లారా లేక మహిళపై ఏమైనా అఘాయిత్యం చేసి హతమార్చారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.అసలు ఆ మహిళ మృతదేహం ఎవరిది అన్నది తేలాల్సి ఉంది. ఆమె ఎవరో కనుగొంటే ఆమెకు ఉన్న గొడవలు, శత్రువులు ఎవరో తెలిసిపోతుందని పోలీసులు వివరించారు. అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</div>
<div><strong>క్షుద్రపూజలు చేస్తే సులువుగా.. </strong></div>
<div>ఉత్తరాదిలో ఇటీవల మూడనమ్మకాలను ప్రజలు బాగా విశ్వసిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత నెల డిసెంబర్‌లో ఇదే విధమైన సంఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజలు చేస్తే సులువుగా 50 నుంచి 60 కోట్ల రూపాయలు వస్తాయని ఇద్దరు తాంత్రికులు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘోరానికి పాల్పడ్డారు. గతేడాది జూన్‌లో ఘజియాబాద్‌లో ఓ మురుగునీటి కాల్వలో తల లేని మొండెం మాత్రమే ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కేసు లోతుగా వెళ్లి విచారణ జరిపితే...ఈ నలుగురు కలిసి అతన్ని చంపి ఆ పుర్రెతో క్షుద్ర పూజలు చేసినట్లు నేరం అంగీకరించారు.</div>
<div>ఇప్పుడు అదే రీతిలో మహిళ మృతదేహాం లభించడంతోఇది కూడా క్షుద్రపూజలు, చేతబడి కోసమే హత్య చేసినట్లుగా అనిపిస్తోంది పోలీసులు అంటున్నారు. రెండు హత్యలకు చాలా సారూప్యత ఉందని అంటున్నారు. అంతకు ముందు తెలంగాణలోని మెదకు జిల్లాలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపేశారు. రామాయంపేట మండలం కత్రియల్‌లో దుండగులు మహిళను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించి తగులబెట్టారు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.</div>
<div> </div>
<div>దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన మరో సంఘటనలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని తారక్‌రామ్‌నగర్‌లో ఎరుకల సంఘం సమావేశంలో ఓ వ్యక్తిని, అతని ఇద్దరు కుమారులను కొంతమంది కలిసి దారుణంగా నరికి చంపేశారు. వారు చేతబడి చేస్తున్నారని...అందువల్లే గ్రామంలో ఎవరికీ ఆరోగ్యం సరింగా ఉండటం లేదని ఆరోపిస్తూ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఏఐ టెక్నాలజీతో సృష్టికి ప్రతి సృష్టి సృష్టిస్తున్నా ఈకాలంలోనూ ఇంకా చేతబడి, బాణామతి వంటి మూడనమ్మకాలను ప్రజలు నమ్మడమే గాక.. అమాయకుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. కొన్నిచోట్ల మానసికంగా కుంగిపోతున్నారు.</div>
<div>Also Read: <a href="https://telugu.abplive.com/telangana/hyderabad/hyderabad-police-intensify-search-for-amit-kumar-gang-who-opened-fire-in-bidar-and-afzalganj-194479" target="_blank" rel="noopener">Hyderabad Gun Firing News:అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఘటనలో సాగుతున్న దర్యాప్తు- అమిత్‌ కుమార్ గ్యాంగ్ కోసం పది బృందాలు గాలింపు</a></div>