<p><strong>Viral News:</strong> ప్రాంతం ఏదైనా సరే పెళ్లి ఊరేగింపు అంటే మినిమమ్ ఉంటుంది. ఇలాంటి ఊరేగింపు కారణంగా తన ఫామ్‌లో ఉన్న కోళ్లు చచ్చిపోయినట్టు ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరేగింపులో భారీ శబ్దాలతో డీజే సౌండ్స్ పెట్టడం వల్లే ఇదంతా జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనుమతికి మించి డీజే సౌండ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. </p>
<p>ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్‌ 25న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహ ఊరేగింపు జరిగింది. ఈ బారాత్‌ కుద్వార్ ప్రాంతంలోని రామ్‌ భద్ర పూర్వ నుంచి బయల్దేరింది. ఈ ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్‌ నుంచి భారీ స్థాయిలో సౌండ్స్ వచ్చాయి. </p>
<p>ఈ ఊరేగింపు సాబిర్ అలీకి చెందిన సాబిర్‌ అలీ పౌల్ట్రీ ఫామ్‌ ముందు నుంచి వెళ్లింది. ఆ సమయంలో డీజే నుంచి వచ్చిన భయంకరమైన శబ్దాలకు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లు భయాందోళనకు గురైనట్టు అలీ పేర్కొన్నారు. ఆ హోరును భరించలేక సుమారు 140 కోట్లు కొట్టుకొని చనిపోయినట్టు చెప్పారు. </p>
<p>సాబిర్ అలీ మంగళవారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పర్సీపూర్ గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ కవి యాదవ్‌పై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిమితికి మించిన శబ్దంతో పాటలు ప్లే చేశారా అనే కోణంలో విచారణ సాగుతోంది. </p>