<p data-path-to-node="1">విజయవాడ: విజయవాడలో ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉండి, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ సెల్) విభాగం, విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ అనే ఈ నిందితులు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా యువతను జిహాదీ భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.</p>
<p data-path-to-node="1">ముగ్గురు యువకులకు పాకిస్థాన్ నుండి నిధులు అందుతున్నాయని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల యువకులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారిని ఉగ్రవాదం వైపు పురిగొల్పుతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. విజయవాడలోని వించిపేట, భవానీపురం ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు.నిందితులు సామాన్య వృత్తుల్లో ఉంటూనే ఇలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.</p>
<p data-path-to-node="1"><strong>మీరు వస్తారని నాకు తెలుసు.. ? పోలీసుల మైండ్ బ్లాక్</strong></p>
<p data-path-to-node="1">వీరిలో డానిష్ ఆటోనగర్‌లో వర్కర్‌గా, రహమతుల్లా షరీఫ్‌ బైక్ డ్రైవర్‌గా, సోహైల్ బేగ్ బిర్యానీ దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. వీరు విజయవాడ వన్‌టౌన్‌లోని ఒక మసీదు వద్ద కలుసుకునేవారని, వీరితో దేశవ్యాప్తంగా మరో 10 మంది టచ్‌లో ఉన్నారని విచారణలో తేలింది. ముఖ్యంగా రహమతుల్లా షరీఫ్ ఇంటర్నెట్‌లో పేలుడు పదార్థాల తయారీ గురించి వెతికినట్లు ఆధారాలు లభించాయి. పోలీసులు అతడి ఇంటికి వెళ్లినప్పుడు ‘మీరు వస్తారని నాకు తెలుసు’ అంటూ రియాక్ట్ కావడంతో అధికారులు షాకయ్యారు. వీరిపై ఉపా (UAPA), ఐటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.</p>
<p> </p>