<p><strong>Turakapalem News:</strong> గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంచలనంగా మారాయి. అధికారులను పరుగులు పెట్టించిన ఘటను అసలు కారణం ఏంటనేది ఇంత వరకు వెలుగులోకి రాలేదు. ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నా ప్రయోజనం లేదు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ వ్యాధి నియంత్రణ బృందం అక్కడ మరికొన్ని పరీక్షలు చేస్తోంది. అసలు విషయం గుర్తించే పనిలో ఉంది. </p>
<p>ఓవైపు వైద్య పరీక్షలు కొసాగిస్తూనే మరోవైపు ఇతర కారణాలపై అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ మిసరీ మరణాల కేసు మరో మలుపు తిరిగేటట్టు కనిపిస్తోంది. ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష వైద్యం కారణంగానే ఇదంతా జరిగిందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన సెలైన్‌ వాడకం, మితి మీరిన డోస్‌లో మందులు ఇవ్వడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.</p>
<p>తురకపాలెంలో జ్వరం వచ్చిన తర్వాత చాలా మంది బాధితులు అనుమానిత ఆర్‌ఎంపీ వద్దే చికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది. వారికి చికిత్స చేసే క్రమంలో కాలం చెల్లిన సెలైన్‌తోపాటు, మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్‌ వాడినట్టు అధికారులు గుర్తించారు. ఈ చర్యల వల్ల బాధితులకు జ్వరాలు తగ్గకపోవడంతోపాటు ప్రాణాంతకంగా మారినట్టు భావిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత వాళ్లంతా వేర్వేరు ఆసుపత్రులను ఆశ్రయించారని తెలుస్తోంది.</p>
<p>కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో మాట్లాడిన తర్వాత అధికారులు ఆర్‌ఎంపీ వైద్యంపై క్లారిటీకి వచ్చారు. దీంతో ఆర్‌ఎంపీ నిర్వహిస్తన్న క్లినిక్‌లో జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో యాంటీబయోటిక్ మందులు గుర్తించారు. అనంతరం క్లినిక్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం అధికారుల అదుపులోనే ఆర్‌ఎంపీ ఉన్నారు. చేసిన వైద్యంపై ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వైద్యం ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. </p>