<p>రంపచోడవరం మన్యం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గంగవరం మండలం మొల్లవరం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించగా, అడ్డతీగల మండలం తిమ్మాపురం సమీపంలో రాత్రి సమయంలో పులి కనిపించినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో మన్యం గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. </p>
<p>పులి కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి. పులి యొక్క పాదముద్రలను (Pugmarks) సేకరించి, అది ఏ దిశగా వెళ్తుందో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ పులి మెడలో రేడియో కాలర్ అమర్చి ఉండటం అధికారులకు కలిసివచ్చే అంశం. దీని ద్వారా పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది, దాని కదలికలు ఎలా ఉన్నాయి అనే సమాచారాన్ని శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అటవీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి మెడలోని రేడియో కాలర్ ద్వారా పులి జాడ కనిపెట్టాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.</p>
<p>ముందస్తు జాగ్రత్తగా అధికారులు గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలోని గ్రామాలకు అప్రమత్తత సందేశాలు పంపారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లవద్దని, ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లరాదని ప్రజలకు సూచించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరుతూ మన్యం ప్రాంత వాసులకు సూచించారు.</p>