<p>భూపాలపల్లి: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతల మధ్య మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూపాలపల్లి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ అనే కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. <a title="ఇప్పటికే ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు" href="https://telugu.abplive.com/telangana/warangal/cm-revanth-reddy-expresses-grief-over-rtc-driver-shankar-gouds-death-promises-support-to-family-245257" target="_self">ఇప్పటికే ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు</a> వ్యక్తమవుతుండగా, తాజాగా జరిగిన ఈ ఘటన కార్మిక వర్గాల్లో మరింత కలకలం రేపింది.</p>
<p>ఆత్మహత్యకు యత్నించిన రవీందర్‌ను గమనించిన తోటి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు, ఇటు తోటి కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>
<p>విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రవీందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. </p>
<p><strong>ఆర్టీసీ జేఏసీతో మంత్రి ప్రభుత్వం చర్చలు..</strong></p>
<p>తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం శుక్రవారం ఉదయం చర్చలు ప్రారంభించింది. తమ డిమాండ్లు, ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లపై ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సహా నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.</p>
<p><strong>ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులు</strong><br />ప్రభుత్వం స్పందించడం లేదంటూ గురువారం నాడు నల్గొండ బస్ స్టాప్ వద్ద రావుల వెంకన్న అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, తోటి కార్మికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.</p>
<p>ఖమ్మంలో మరో ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. డి లింగారెడ్డి భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పురుగుల మందు తాగిన డ్రైవర్ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కి తరలింపు చికిత్స అందిస్తున్నారు.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/yPMacZg0XtA?si=SMRmXKiM9FvH0Vi7" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>కార్మికులు ఆవేశపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్</strong><br />ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడి ప్రాణాలు తీసుకోవద్దని, శాంతియుతమైన మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసనలను తెలియజేయాలని మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.</p>
<p>ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తీరుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదని, కానీ కార్మికులను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కొన్ని రాజకీయ పక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు సంయమనం పాటించాలని మరియు కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.</p>
<p>మృతి చెందిన శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. చర్చల ప్రక్రియ కొనసాగుతున్నందున, కార్మికులు సంయమనంతో ఉండాలని ఆయన మరోసారి కోరారు.</p>