<p><strong>Telangana News: </strong>తెలంగాణలో బీర్ల పంచాయితీ తీవ్రమవుతోంది. సడెన్‌గా బీర్ల సరఫరా నిలిపేయడంపై స్పందించిన ప్రభుత్వం... కంపెనీ గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి లేమని ప్రకటించింది. ఒత్తిడితో డిమాండ్‌లు సాధించుకోలేరని స్పష్టం చేసింది. దీనిపై అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో వివరిస్తూ అబ్కారీ శాఖ డైరెక్టర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ లెటర్ రాశారు. అబ్కారీ శాఖ మంత్రితో కూడా సమావేశమై సమస్యను వివరించారు. </p>
<p><img src="https://pbs.twimg.com/media/Gg3a31-bkAA1Bm7?format=jpg&name=large" alt="Image" /></p>
<p>బీర్ల సప్లైను ఎందుకు ఆపేసిందో మరింత వివరంగా చెప్పుకొచ్చింది యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ సంస్థ. బీర్ల తయారీకి ఉపయోగించే ముడిసరకు ధరుల విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది యూబీఎల్. బీర్ తయారీకి అయ్యే ఖర్చు 16 శాతమైతే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు 70 శాతం చెల్లిస్తున్నట్టు చెప్పింది. అందుకే బీర్ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ధరలు సవరించకపోవడంతో నష్టాలతో వ్యాపారం చేయాల్సి వస్తోందని ప్రకటించింది. </p>
<p><img src="https://pbs.twimg.com/media/Gg3a319aAAAQ4_M?format=jpg&name=large" alt="Image" /></p>
<p><strong>మంత్రికి సమస్యలు చెప్పుకున్న యూబీఎల్</strong></p>
<p>రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 702 కోట్ల రూపాయల బకాయిల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. ఓవైపు ముడిసరకు ధరలు పెరిగిపోవడం, ధరలు పెంచకపోవడం, బకాయిలు విడుదల కాకపోవడంతో సరఫరా నిలిపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించింది. ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌కు లేఖ ఇచ్చిన యూబీఎల్‌... గురువారం అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. </p>
<p><strong>Also Read: <a title="ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు" href="https://telugu.abplive.com/telangana/the-supreme-court-refused-to-hear-the-ktr-quash-petition-immediately-193549" target="_blank" rel="noopener">ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు</a></strong></p>
<p><strong>మంత్రి వివరణ ఇదే </strong></p>
<p>సడెన్‌గా యూబీఎల్‌ బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రభుత్వం స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. సంస్థ చెప్పినట్టు ధరలు పెంచితే మాత్రం బీర్ ధర 250 దాటిపోతుందని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అసలు ఇలా ఒత్తిడి తీసుకొచ్చి పని చేయించుకుంటామంటే ప్రభుత్వం లొంగబోదని స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుపై ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని అందుకే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసినట్టు పేర్కొన్నారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత పెంచుతామని తేల్చి చెప్పారు. </p>
<p>యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ధరల పెంపు డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించేందుకు నిరాకరించిందని తెలిపారు. దాదాపు 33.10% ధరల పెంపును కోరుతోందని వివరించారు. కింగ్‌ఫిషర్ ప్రీమియం బీర్ రూ. 150 నుంచి రూ. 210 వరకు, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ రూ. 120 నుంచి రూ. 220 వరకు, కింగ్‌ఫిషర్ అల్ట్రా లాగర్ రూ. 210 నుంచి రూ. 270 వరకు, కింగ్‌ఫిషర్ అల్ట్రా మాక్స్ ప్రీమియం స్ట్రాంగ్ రూ. 220 నుంచి రూ. 280 వరకు, హీనెకెన్ రూ. 230 నుంచి రూ. 310 వరకు పెంచాలని ప్రతిపాదించిందన్నారు. </p>
<p>తెలంగాణలో ఆరు సంస్థల బీర్లు సరఫరా అవుతున్నాయి. అందులో మేజర్ వాట యూబీఎల్ సప్లై చేసే బీర్లదే. నెలకు దాదాపు 40 లక్షల బీర్లు విక్రయం జరుగుతోంది. ఒకవేళ సరఫరా ఆగిపోతే కొరత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. </p>
<p><strong>Also Read: <a title="రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్" href="https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-acb-questioned-ktr-for-an-entire-day-in-the-formula-e-car-race-case-193583" target="_blank" rel="noopener">రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్</a></strong></p>