<p><strong>Telangana Indiramma Housing Latest News:</strong>తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. గ్రామ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఇండ్లు వచ్చాయో వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్‌ చెప్పింది. </p>
<p>ఐదేళ్లలో నిర్మించాల్సిన ఇళ్లను టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే లబ్ధిదారులు కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా చేపట్టారు. మొదటి విడతలో భూమి ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఒకేసారి అన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ ఇళ్లను ముందు పూర్తి చేయనున్నారు.</p>
<p>ఇందిరమ్మ ఇళ్ల కోసం కొన్ని గ్రామాలను ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎలా కట్టాలో కూడా వారికి వివరించారు. ఇతర సందేహాలను కూడా వారికి క్షుణ‌్నంగా అర్థమయ్యేలా చెప్పారు. </p>
<p>గ్రౌండింగ్ వర్క్ పూర్తి అయినందున మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ ఇంటి కోసం చేసిన ఖర్చును నాలుగు విడతల్లో ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు లక్షల రూపాయాల్లో నిర్మించి ఇంటి ఖర్చును నాలుగు విడతల్లో ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే తొలి విడత డబ్బులను మార్చిలో విడుదల చేయనున్నట్టు సమాచారం. </p>
<p><strong>Also Read: <a title="మూడు నెలలు అత్యంత కీలకం- సాగు, తాగునీటిపై తెలంగాణ ఫోకస్, టెలిమెట్రీపై ముందుకు రాని ఏపీ" href="https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-prioritises-water-for-drinking-and-irrigation-and-power-issues-as-summer-heat-intensifies-198222" target="_blank" rel="noopener">మూడు నెలలు అత్యంత కీలకం- సాగు, తాగునీటిపై తెలంగాణ ఫోకస్, టెలిమెట్రీపై ముందుకు రాని ఏపీ</a></strong></p>
<p> ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మార్చి 31 నాటికి బేస్‌మెంట్ వరకు పూర్తి చేయించాలని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారికి మార్చిలో డబ్బులు వేయబోతున్నారు. మొదటి విడతలో లక్ష రూపాయలు ప్రతి లబ్ధిదారులడి ఖాతాలో వేస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన 5 లక్షల రూపాయాల్లో బేస్‌మెంట్ దశ పూర్తైతే మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఇందులో కూడా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఉండేందుకు లబ్ధిదారుడి ఖాతాలోనే డబ్బులు వేయనున్నారు. </p>
<p>లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందుకు ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తి చేసి అంత త్వరగా నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పిన బ్లూప్రింట్‌ ఆధారంగానే ఇంటి నిర్మాణం ఉండాలని సూచిస్తున్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వారి అభిరుచి ప్రకారం ఇంటిని నిర్మించుకోవచ్చు. ఇలా నిర్మాణం చేపట్టిన ఇంటి నిర్మాణ దశ ఎప్పటికప్పుడు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. అందులో అప్‌లోడ్ చేస్తూ ఉన్న నిర్మాణ ప్రక్రియను డాక్యుమెంట్ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. </p>
<p>నిర్మాణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతోపాటు మండల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. ఆకస్మిక తనిఖీలతో నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ సామగ్రి లభ్యతపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడా కొరత రాకుండా చూడాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి కోసం సమీప ప్రాంతంలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. రవాణా ఖర్చు మాత్రం లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. భూమి ఉన్న వాళ్లకే మొదటి విడతలో 71482 ఇళ్లు కట్టించి ఇవ్వాలని భావించింది <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ప్రభుత్వం. <br />లబ్ధిదారులు ఏం చేయాలి?</p>
<p>ఇందిరమ్మ యాప్‌ సర్వే చేసిన సమయంలోచూపిన సొంత స్థలంలోనే ప్రక్రియ చేపట్టాలి. వేరే చోట చేస్తామంటే కుదరదు. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. <br />నిర్మాణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి. ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తారు. </p>
<p>ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి పునాది వేసేంత వరకు ఖర్చంతా లబ్ధిదారుడే భరించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చే నెలలో డబ్బులు వేస్తుంది. మొదటి విడతలో లక్ష రూపాయుల అందిస్తుంది. </p>
<p>ప్రతి ఇందిరమ్మ ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. సమీపంలో ఉండే రీచ్‌ నుంచి సొంత రవాణా ఖర్చులు భరించి తెచ్చుకోవాలి. ఈ ఇసుకకు సంబంధించిన కూపన్లు ఎమ్మార్వో, లేదా ఆర్డీవో నుంచి పొందాల్సి ఉంటుంది. </p>
<p>హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా మిగతా సామగ్రిని కూడా తక్కువ ధరకే అందిస్తారు. </p>
<p>ఏఈ/ఎంపీడీవోలు పరిశీలించి ఇంటి నిర్మాణం పూర్తైన దశను బట్టి డబ్బులు జమ చేసేందుకు సిఫార్సు చేస్తారు. </p>
<p><strong>Also Read: <a title="ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు" href="https://telugu.abplive.com/telangana/indiramma-housing-scheme-telangana-govt-guidelines-for-indiramma-houses-in-state-197339" target="_blank" rel="noopener">ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు</a></strong></p>