Telangana Cabinet Decisions:తెలంగాణ గిగ్ కార్మికులకు గుడ్‌న్యూస్: 'ప్లాట్‌ఫారమ్ గిగ్ వర్కర్స్ చట్టం-2025' ముసాయిదాకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

2 weeks ago 2
ARTICLE AD
<p><strong>Telangana Cabinet Decisions: </strong>తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా ఉన్న గిగ్, ప్లాట్&zwnj;ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన గుర్తింపు, సంక్షేమం కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటన మేరకు, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన &ldquo;తెలంగాణ ప్లాట్&zwnj;ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం)చట్టం, 2025&rdquo; ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు భారతదేశంలోనే అత్యంత సమగ్రమైన చట్టాల్లో ఒకటిగా నిలవనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.</p> <h3>గిగ్ వర్కర్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?</h3> <p>నీతి ఆయోగ్&zwnj; నివేదిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది గిగ్ &amp; ప్లాట్&zwnj;ఫారమ్ కార్మికులు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పని చేస్తున్నారు. ఈ కార్మికులు తరచుగా రోజుకు 10&ndash;12 గంటలు, వారానికి 7 రోజులు పని చేస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, బీమా, లేదా సదరు కంపెనీలతో తమకు వచ్చే ఆదాయం విషయంలో బేరసారాల శక్తి లేకుండా పోయింది. వీరు పని చేసే వివిధ యాప్&zwnj;లలో (స్విగ్గీ, ఊబర్, జొమాటో, బ్లింకిట్, డంజో, ఓలా, అర్బన్ కంపెనీ, హౌస్ జాయ్) పని చేసే గిగ్ వర్కర్ల ఆదాయం తక్కువగా ఉంటోంది. దీనిపై చర్చించే అవకాశం లేదు. దీనివల్ల వీరికి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. చెల్లింపుల్లో కూడా ఆయా యాప్ కంపెనీలు కొన్ని సరైన రీతిలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లింపుల్లో పారదర్శకత లేకపోవడం, రేటింగ్ వంటి అంశాలతో గిగ్ వర్కర్లకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఉంది. వీరి సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన యంత్రాంగం లేదు. ఈ కారణంగా యాప్ ప్లాట్&zwnj;ఫారమ్ యాజమాన్యాల తీరు ఈ గిగ్ వర్కర్లకు నష్టం చేస్తున్నట్లు ఇందులో పని చేసే వారు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతపై కోడ్, 2020 రాష్ట్ర పథకాలకు వీలు కల్పిస్తుంది. అయినప్పటికీ, ఈ నియమాలు దేశవ్యాప్తంగా అమలు కావడం లేదు. ఈ కొత్త శ్రామిక శక్తి విభాగానికి చట్టపరమైన గుర్తింపు, సంక్షేమం, నియంత్రణ, పర్యవేక్షణ చేసేందుకు బలమైన రాష్ట్ర చట్టం తక్షణావసరం అని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. దీన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చట్టం చేయాలని నిర్ణయించింది.</p> <h3>కేబినెట్ ఆమోదం పొందిన ముసాయిదా బిల్లు ముఖ్యాంశాలు</h3> <p>గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి, వారి ఉద్యోగ భద్రతకు సంబంధించి 23-12-2024న జరిగిన గిగ్, ప్లాట్&zwnj;ఫారమ్ కార్మికుల ఇంటరాక్షన్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> వారి సమస్యలపై దృష్టి సారించి పటిష్టమైన చట్టం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకటన ప్రకారం, కార్మిక, ఉపాధి, శిక్షణ &amp; ఫ్యాక్టరీల (LET&amp;F) విభాగం, అటు గిగ్ వర్కర్లు, ఇటు యాప్ ఆధారిత యాజమాన్యాలు, అలాగే తెలంగాణ న్యాయశాఖతో సంప్రదించి రూపొందించిన ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీనివల్ల గిగ్ వర్కర్లకు ఒనగూరే ప్రయోజనాలు ఇవే:</p> <h3>1. చట్టబద్ధమైన గుర్తింపు</h3> <p>గిగ్ కార్మికులకు మొట్టమొదటి చట్టపరమైన గుర్తింపు, ప్రత్యేక ID లభిస్తుంది. కార్మికులుగా వీరు రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వర్గానికి అందించే పథకాలకు అర్హత పొందుతారు.</p> <h3>2. సామాజిక భద్రత &amp; సంక్షేమ బోర్డు</h3> <p>కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్&zwnj;గా 20 మంది సభ్యులతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం, ప్లాట్&zwnj;ఫామ్ కంపెనీలు, కార్మికులు, పౌర సమాజం, సాంకేతిక నిపుణులు ఉంటారు. ఈ బోర్డు పదవీకాలం 3 సంవత్సరాలు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్&zwnj;లో ఏర్పాటు చేస్తారు.</p> <h3>3. గిగ్ కార్మికుల హక్కులు</h3> <p>రిజిస్ట్రేషన్ హక్కు, సంక్షేమ పథకాలకు అవకాశం లభిస్తుంది. గిగ్ వర్కర్లకు ఈ ముసాయిదా బిల్లు చట్టం అయితే, సురక్షితమైన పని పరిస్థితులు హక్కుగా ఏర్పడతాయి. వారికి వచ్చే వేతనం లేదా కమిషన్ చెల్లింపులు, రేటింగ్&zwnj;లు, అల్గోరిథంలో పారదర్శకత హక్కుగా లభిస్తుంది. కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చట్టపరంగా వీరికి ఈ హక్కులు సంక్రమిస్తాయి. వీటిని మీరితే ఆ కంపెనీలపై చట్టపరమైన చర్యకు అవకాశం కలుగుతుంది.</p> <h3>4. తప్పనిసరి రిజిస్ట్రేషన్</h3> <p>గిగ్ వర్కర్ల పేర్ల నమోదు తప్పనిసరి. యాప్ ప్లాట్&zwnj;ఫారమ్ కంపెనీలు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిగేటర్లు 45 రోజుల్లో సంక్షేమ బోర్డు వద్ద తమ కంపెనీ పేరు నమోదు చేసుకోవాలి. దీనివల్ల ఎన్ని కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి, వారి వద్ద ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారన్న స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంటుంది.</p> <h3>5. సంక్షేమ నిధి &amp; నిధుల యంత్రాంగం</h3> <p>గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిధులను అగ్రిగేటర్లు (యాప్ కంపెనీలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ గ్రాంట్, సీఎస్ఆర్ (CSR) విరాళాలను సంక్షేమ నిధికి సమకూర్చడం జరుగుతుంది. దీనివల్ల గిగ్ వర్కర్ మరణించినా, ప్రమాదం జరిగినా, ఇతర ఆరోగ్య సంక్షేమం వంటి వాటికి ఈ నిధులను వినియోగించడం జరుగుతుంది.</p> <h3>6. పారదర్శకత &amp; అల్గోరిథమిక్ జవాబుదారీతనం</h3> <p>గతంలో మాదిరి రేటింగ్&zwnj;లలో ఇష్టారీతిన అగ్రిగేటర్లు వ్యవహరించడం కుదరదు. యాప్ కంపెనీలు తప్పనిసరిగా తమ అల్గోరిథమ్&zwnj;లు, అసైన్&zwnj;మెంట్లు, గిగ్ వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు, వారి ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలన్నీ కార్మికులకు తెలిసిన భాషలో బహిర్గతం చేయాల్సిందే.</p> <h3>7. గిగ్ వర్కర్ల చట్టంలో మరిన్ని ముఖ్యాంశాలు</h3> <p>గిగ్ వర్కర్లతో అగ్రిగేటర్ల ఒప్పంద మార్పులకు 14 రోజుల నోటీసు ఇవ్వాలి. గిగ్ వర్కర్ల దుష్ప్రవర్తన మినహా ఇతరత్రా కారణాలతో తొలగించాలంటే 7 రోజుల నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలి. గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య సమస్య వస్తే, వర్కర్ల కోసం ప్రభుత్వం ఫిర్యాదు పరిష్కార అధికారిని ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు ప్లాట్&zwnj;ఫామ్-స్థాయి అంతర్గత వివాద పరిష్కార కమిటీని (100 కంటే ఎక్కువ కార్మికులకు) ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అప్పీలేట్ యంత్రాంగం సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిగ్ వర్కర్ల చెల్లింపుల కోసం డిజిటల్ వెల్ఫేర్ ఫీజు వెరిఫికేషన్ సిస్టమ్ (WFFVS) ఏర్పాటు చేస్తారు. చెల్లింపులు పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం ఏర్పాటు. ఈ చెల్లింపుల ట్రాకింగ్ పారదర్శకంగా ఉండాలన్నది ప్రభుత్వ విధానం.</p> <h3>8. నిబంధనలు మీరితే కొరడా</h3> <p>సంక్షేమ రుసుము, జరిమానాలు చెల్లించని ప్లాట్&zwnj;ఫారమ్&zwnj;లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. జరిమానాలు కూడా వేయడం జరుగుతుంది.</p> <ul> <li>మొదటి నేరానికి: ₹ 50,000 జరిమానా.</li> <li>రెండోసారి చట్టం మీరితే: ₹ 1,00,000 జరిమానా.</li> <li>మూడోసారి ఇదే పరిస్థితి ఉంటే: ₹ 1,50,000 జరిమానా వేస్తారు.</li> </ul> <p>అప్పటికీ పరిస్థితి మారకపోతే, చెల్లించాల్సిన బకాయి మొత్తంలో ఐదు రెట్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.</p> <h3>దేశంలో పటిష్టమైన బిల్లుగా తెలంగాణ గిగ్ వర్కర్ల ముసాయిదా బిల్లు</h3> <p>భారతదేశంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ బిల్లు అత్యంత పటిష్టమైన బిల్లుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రాజస్థాన్ ప్రభుత్వం 2023లోనే ఇలాంటి చట్టాన్ని ఆమోదించినా, దాని నియమాల రూపకల్పన జరగలేదు. దీంతో చట్టం అమలు నిలిచిపోయింది. <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a> రాష్ట్రం మే 2025లో ఒక ఆర్డినెన్స్&zwnj;ను నోటిఫై చేసి, అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ, సంక్షేమ నిధిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను చేర్చలేదు. ఇది తెలంగాణ చట్టంలో ఉన్న ఒక ప్రత్యేకత అని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, అక్కడ గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం లేదు; వారు సాధారణ అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పరిధిలోకి వస్తారు. జార్ఖండ్ క్యాబినెట్ కూడా బిల్లును ఆమోదించినప్పటికీ, అది ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో, రిజిస్ట్రేషన్, సంక్షేమం, అల్గోరిథమిక్ పారదర్శకత వంటి అంశాలను చేర్చిన తెలంగాణ బిల్లు, జాతీయ స్థాయిలో అత్యంత సమగ్రమైన, అమలుకు సిద్ధంగా ఉన్న చట్టంగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది.</p>
Read Entire Article