<p style="text-align: justify;"><strong>Varun Chakaravarthy Playing 11:</strong> టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వరుణ్ 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించాడు. ఈ బౌలింగ్ స్టాట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతన్ని ఆడించవద్దని, బ్యాటింగ్‌లోనూ ఏ ప్రయోజనం ఉండదని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ 11లో అవకాశం దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. </p>
<p style="text-align: justify;">టీ20 ఫైనల్ మ్యాచ్‌కు ముందురోజు జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్ లో భాగమవుతాడా లేదా అని అడిగినప్పుడు, మేనేజ్‌మెంట్ అతడి ఫామ్‌ గురించి ఆందోళన చెందడం లేదని, జట్టు అతన్ని పూర్తిగా నమ్ముతోందని అన్నాడు. సూర్య చేసిన ఈ ప్రకటన చక్రవర్తి ఫైనల్ మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటాడని చెబుతోంది. కానీ మోదీ స్టేడియంలో సీన్ చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. </p>
<p style="text-align: justify;"> తాజాగా ఒక అప్‌డేట్ వచ్చింది. సాధారణంగా ట్రైనింగ్ సెషన్ జరిగినప్పుడల్లా, వరుణ్ చక్రవర్తి ప్రాక్టీస్ చేయడానిక స్టేడియానికి వచ్చే క్రికెటర్లలో ముందుంటాడు. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లోని <a title="నరేంద్ర మోదీ" href="https://www.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> స్టేడియంలో ఇండియా టీం ప్రాక్టీస్ చేయడానికి రాగా.. వరుణ్ చక్రవర్తి కాస్త వెనుక నిలబడ్డాడు. మిగిలిన ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.</p>
<p style="text-align: justify;">మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫైనల్‌కు ముందు నెట్స్‌లో ముందుగా ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అంటే కీలకమైన ఫైనల్లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.</p>
<p style="text-align: justify;">వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌లలో ప్రభావం చూపడంలేదు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టుకు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో తాను ఆడిన చివరి 4 మ్యాచ్‌లలో వరుణ్ చక్రవర్తి మొత్తం 186 పరుగులు సమర్పించాడు. అంతకుముందు ప్రపంచ కప్ తొలి 4 మ్యాచ్‌లలో వరుణ్ 9 వికెట్లు తీశాడు. చక్రవర్తి ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 13 వికెట్లు తీశాడు. T20 ప్రపంచ కప్ 2026లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. కానీ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం భారత జట్టుకు టార్గెట్ డిఫెండ్ చేసుకోవడంలో సమస్యను తెచ్చి పెడుతుంది. లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయడానికి వరుణ్ బౌలింగ్ మన బలహీనతగా మారే ప్రమాదం పొంచి ఉంది. </p>
<p style="text-align: justify;"> </p>