<p><strong>INDIA Bloc Cracks In Tamil Nadu: </strong>తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి పార్టీల్లో విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న డిమాండ్లు, వాటిపై డీఎంకే నేతల ఘాటు స్పందనలు కూటమిలో ముదురుతున్న సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌పై డీఎంకే సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవినే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న బాహాట విమర్శలు కూటమి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.</p>
<p><strong>కాంగ్రెస్ ఎంపీలే లక్ష్యంగా డీఎంకే ఎమ్మెల్యే విమర్శలు</strong></p>
<p>మధురైలో జరిగిన ఒక బహిరంగ సభలో డీఎంకే ఎమ్మెల్యే , మధురై అర్బన్ జిల్లా కార్యదర్శి జి. తలపతి .. కాంగ్రెస్ ఎంపీలు బి. మాణిక్యం ఠాగూర్ , ఎస్. జోతిమణి లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి అండతో ఎంపీలుగా గెలిచిన వీరు, ఇప్పుడు అధికారంలో వాటా కోరుతూ అనవసర ఘర్షణలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వీరికి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు నిరాకరించాలని డీఎంకే నాయకత్వాన్ని ఆయన కోరడం చర్చనీయాంశంగా మారింది.</p>
<p><strong>డీఎంకే లేకపోతే ఇండీ కూటమి లేదు </strong></p>
<p>తమిళనాడులో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మాని, కాంగ్రెస్ నేతలు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రాంతీయ నేతలే జాతీయ కూటమికి వెన్నెముక అని అని గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అరాచకాలను ఎదిరించి, తమిళ గుర్తింపును కాపాడుతున్న వ్యక్తి స్టాలిన్ అని, డీఎంకే లేకపోతే అసలు 'ఇండియా' కూటమే లేదని ఆయన వారంటున్నారు. మిత్రపక్షాలు సీట్లపై పట్టుబడుతుండటంతో సీట్ల పంపకాల చర్చలు ముమ్మరం చేశాయి. జాతీయ స్థాయిలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చినప్పుడు తలెత్తే ఒత్తిడి అంశాలను ఈ పరిణామాలు హైలైట్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల చర్చలు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది. </p>
<p><strong> కమల్ హాసన్ ఎంట్రీతో మారుతున్న సమీకరణాలు </strong></p>
<p>ఒకవైపు డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం రాబోయే ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను ఆశిస్తోంది. సోమవారం డీఎంకే మంత్రులు పీకే శేఖర్ బాబు, ఎంపీ సామినాథన్ చెన్నైలోని ఎంఎన్ఎమ్ ప్రధాన కార్యాలయంలో కమల్ హాసన్‌తో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నప్పటికీ, సీట్ల సర్దుబాటుపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అధికార పంపిణీ విషయంలో <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పట్టుబట్టడం.. దానికి డీఎంకే దీటుగా స్పందించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమిలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/gold-is-extracted-from-mines-where-does-silver-come-from-235797" width="631" height="381" scrolling="no"></iframe></p>
<p> </p>