<p>సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించింది. అతని కెప్టెన్సీలోనే జట్టు ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ టీ20 కెప్టెన్సీలో మార్పులు చేస్తున్నారు. ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీనికంటే ముందే బీసీసీఐ (BCCI) కీలక మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.</p>
<p>సూర్యకుమార్ యాదవ్ గత రెండేళ్లుగా టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ టీ20 రిటైర్మెంట్ తర్వాత 2024లో సైర్యను కెప్టెన్‌గా చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, సూర్యకుమార్ యాదవ్‌ నుంచి కెప్టెన్సీని మరో స్టార్ బ్యాటర్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది. టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చని, కొత్త కెప్టెన్‌ అయ్యే రేసులో అయ్యర్ అందరికంటే ముందున్నారని సమాచారం.</p>
<p>శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడంతో పాటు అతడికి కెప్టెన్సీ బాధ్యతలు సైతం అప్పగించవచ్చు. 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ 2023 డిసెంబర్ 3న తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అంటే రెండేళ్లకు పైగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు మరికొన్నేళ్లు టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. </p>
<p><strong>జట్టులో ఆటగాడిగా సూర్యకుమార్</strong><br />ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తరువాత సూర్యకుమార్ యాదవ్ భారత్‌కు టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందించిన కెప్టెన్. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు, బీసీసీఐ మేనేజ్‌మెంట్ సూర్యను జట్టులో ఆటగాడిగా కొనసాగించనున్నారు. ఐపీఎల్ 2026 తర్వాత సెలక్టర్లు కొత్త టీ20 కెప్టెన్‌ను ప్రకటించవచ్చు. ఐర్లాండ్‌లో 2 టీ20లు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సూర్య ఆటగాడిగా జట్టులో ఎంపికవుతారు.</p>
<p><strong>సూర్య కెప్టెన్సీ రికార్డు ఎలా ఉంది?</strong><br />సూర్యకుమార్ యాదవ్ 52 మ్యాచ్‌లలో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది, కేవలం 8 మాత్రమే ఓడిపోయింది. కెప్టెన్‌గా సూర్య గెలుపు శాతం 76.92గా ఉంది. 50 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన భారత ఆటగాళ్లలో (ధోని, కోహ్లీ, రోహిత్) సూర్యకుమార్ విన్నింగ్ శాతమే ఎక్కువగా ఉంది. బ్యాటర్‌గానూ సూర్య అద్భుతాలు చేశాడు. పటిష్ట జట్లపై సైతం ఒంటి చేత్తో విజయాలు అందించాడు.</p>
<p><strong>పంజాబ్ కెప్టెన్‌గా అయ్యర్</strong></p>
<p>స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే, ఆయన తన కెప్టెన్సీలో 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌ అయింది. అంతకుముందు 2020లో అయ్యర్ కెప్టెన్సీలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకుంది. 2025లో అయ్యర్ కెప్టెన్సీలోనే పంజాబ్ కింగ్స్‌ ఫైనల్‌ చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ (IPL 2026)లో కూడా పంజాబ్ కింగ్స్ అయ్యర్ కెప్టెన్సీలో పటిష్టంగా కనిపిస్తోంది. గత 3 మ్యాచులు ఓడినప్పటికీ మొదటి 7 మ్యాచులలో ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో కప్పు కొట్టే జట్లో పంజాబ్ ఒకటని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అయ్యర్ కెప్టెన్సీపై ఉన్న నమ్మకంతోనే ఈ మాట అంటున్నారు.</p>