<p class="abp-article-slug"><strong>Strait of Hormuz Crisis |</strong> అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఇటీవల క్రూడాయిల్ ధర దాదాపు 12 శాతం పెరిగింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ మార్గంలో ఏమైనా నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే పేల్చివేస్తాం.. వాటికి నిప్పు పెడతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. హర్ముజ్ జలసంధి మార్గంలోకి వచ్చే నౌకల భరతం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది పడతారని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం సమయంలో ఇరాన్ అన్నంత పని చేసేసింది. ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు సరఫరా మార్గాలలో ఒకటి, కావడంతో ఇరాన్ తమ ఆధిపత్యం చాటుకునేందుకు హర్ముజ్ జలసంధి అస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో ప్రపంచంలో పలు దేశాలకు ముడి చమురు సహా ఇతర రవాణాకు ఆటంకం తలెత్తుతోంది. </p>
<p><strong>భారత్ వద్ద ఎంత ముడి చమురు నిల్వ ఉంది?</strong></p>
<p>నివేదికల ప్రకారం, భారత్ ప్రస్తుతం కనీసం 10 రోజుల డిమాండ్‌ను తీర్చడానికి తగినంత ముడి చమురు నిల్వను కలిగి ఉంది. అయితే, హర్ముజ్ జలసంధి ఎక్కువ కాలం మూసివేస్తే కనుక భారత్ దిగుమతి మార్గాలను మార్చుకోవలసి ఉంటుంది. రష్యా లేదా ఇతర దేశాల నుండి కొనుగోలును పెంచకతప్పదు. </p>
<p><strong>హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు ముడి చమురు </strong></p>
<p>హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు భారత్ దాదాపు 2.5 నుండి 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు ఎక్కువగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ సహా మధ్యప్రాచ్య దేశాల నుండి వస్తుంది. ముడి చమురుతో పాటు, భారత్ తన 90 నుండి 100 శాతం LPG సరఫరా, దాదాపు 60% LNG దిగుమతి కోసం ఇదే మార్గంపై ఆధారపడి ఉంది. అందుకే హర్ముజ్ జలసంధి ఇంధనంతో పాటు ఎల్పీజీ, పారిశ్రామిక అవసరాలకు చాలా ముఖ్యం.</p>
<p><strong>వ్యూహాత్మక నిల్వలతో ఉపశమనం </strong></p>
<p>భారత్ ప్రస్తుతం కొంతమేర పెట్రోలియం నిల్వలను కలిగి ఉంది. ఇవి దాదాపు 10 రోజుల ముడి చమురు డిమాండ్‌ను తీర్చుతుంది. ఈ నిల్వలు ఆకస్మిక అంతరాయాల సమయంలో కొంతకాలం ఊరట కలిగిస్తాయి. అయితే, ఈ నిల్వలు ఎక్కువ కాలం కొనసాగే దేశంలోనూ ముడిచమురు సంక్షోభం తలెత్తుతుంది. </p>
<p><strong>ఇతర సరఫరా మార్గాలు..</strong></p>
<p>హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత్ రష్యా నుండి దిగుమతిని తిరిగి పెంచనుంది. అయితే, రష్యా చమురు రవాణా భారత్‌కు చేరుకోవడానికి దాదాపు ఒక నెల పడుతుంది. మిడిల్ ఈస్ట్ నుండి దిగుమతి చేసుకుటే 5 రోజులు పడుతుంది. నివేదికల ప్రకారం వెనిజులా, బ్రెజిల్, ఆఫ్రికా ఉత్పత్తిదారుల నుండి ఎక్కువ దిగుమతి చేసుకోవాలని భారత్ యోచిస్తోంది.</p>
<p><strong>ప్రపంచ చమురు ధరలలో పెరుగుదల </strong></p>
<p>ప్రపంచంలోని దాదాపు 20 శాతం చమురు సరఫరా హర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఈ జలసంధి మూసివేతతో ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువకు చేరుతాయి. భారత్‌కు ముడి చమురు ధరలలో $1 పెరుగుదల వార్షిక దిగుమతికి అదనంగా 2 మిలియన్ డాలర్లు అవుతుంది. </p>
<p>భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల సరఫరాలో అంతరాయం దేశంపై ప్రభావం చూపడంతో చమురు ధరలు పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చులతో పాటు ఆహార పదార్థాలు, సంబంధిత వస్తువుల ధరలకు రెక్కలు వస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. </p>