<p><strong>Shamshabad Airport: </strong>రెండు రోజుల నుంచి భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఏటీసీ ఆటోమేటిక్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి ముంబైలో అదే పరిస్థితి ఏర్పడింది. ఇంకా అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఇలా వరుసగా విమానాశ్రాయాల్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. </p>
<p>దేశంలోని వివిధ విమానాశ్రయాల్లోని ఏటీసీ అటోమేటిక్ వ్యవస్థ పని చేయలేదు. 36 గంటలు దాటిన తర్వాత ఢిల్లీ, ముంబై, శివమొగ్గ ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు కంట్రోల్‌లోకి వస్తున్నాయి. అందుకే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా రద్దు చేయడం గందరగోళానికి కారణమైంది. తమకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం ఏంటని ప్రయాణికులు ఆందోళనబాట పట్టారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. </p>
<p>శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కౌలాలంపూర్‌, వియత్నాం, గోవా వెళ్లే విమానాలను అర్ధాంతరంగా రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, శివమొగ్గ వెళ్లే విమానాలను కూడా రద్దు చేశారు. దీనికి మాత్రం అక్కడ ఏటీసీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. </p>
<p>అర్థరాత్రి వేళలో ఇలా నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎందుకు ఇలాంటి పని చేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే రూడ్‌గా సమాధానం చెప్పారని మండిపడ్డారు. గంటల తరబడి ఎదురు చూస్తున్నా వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. </p>
<h3>ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ పరిస్థితి</h3>
<p>మరోవైపు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సాంకేతిక సమస్య పరిష్కారమైందనివిమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఢిల్లీ విమానాశ్రయ అథారిటీ ప్రకటించింది. పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుందని అందులో పేర్కొంది. </p>
<p>ఢిల్లీ విమానాశ్రయ అథారిటీ ఇచ్చిన ప్రకటనలో ఇలా ఉంది , "ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమాన ప్రణాళిక ప్రక్రియకు సహాయపడే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)ను ప్రభావితం చేసే సాంకేతిక సమస్య క్రమంగా మెరుగుపడుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సంబంధిత అధికారులందరూ అసౌకర్యాన్ని తగ్గించడానికి పనిచేస్తున్నారు. తాజా విమాన సంబంధిత సమాచారం కోసం ప్రయాణీకులు తమ విమానయాన సంస్థతో సన్నిహితంగా ఉండాలని సూచించారు."</p>
<p>800 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితమయ్యాయి.</p>
<p>గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీ విమానాశ్రయంలో 800 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితమయ్యాయి. సాంకేతిక సమస్య కారణంగా AMSS మూసివేశారు. AMSS అంటే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్. ఇది విమాన కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది, కానీ సాంకేతిక సమస్య కారణంగా ఇది ఆటోమేటిక్‌గా మూసివేశారు. ఈ సమస్య వేల మంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించింది.</p>