<p>Supreme Court | న్యూఢిల్లీ: <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ మంజూరు చేస్తున్న క్రమంలో పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు కొన్ని కీలక షరతులను విధించింది.</p>
<p>అస్సాం సీఎం సతీమణి రణికి భూయాన్ శర్మకు పలు పాస్‌పోర్టులు, విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ పవన్ ఖేరా గతంలో తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గువాహటి క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఆయనపై ఫోర్జరీ, పరువు నష్టం కేసులు నమోదుచేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట గువాహటి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజాగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.</p>
<p>బెయిల్ సందర్భంగా పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసులోని సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడకూడదని పేర్కొంది. అంతేకాకుండా, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించింది. ఇక విచారణ సమయంలో అవసరమని భావిస్తే.. మరిన్ని షరతులు విధించే స్వేచ్ఛ ట్రయల్ కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.</p>
<p> </p>