<p>పలమనేరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, ప్రజలను రక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసలమడుగు వద్ద ఉన్న ఈ కేంద్రానికి విచ్చేసిన ఆయన, ఏనుగుల శిక్షణ, వాటి సంరక్షణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు.</p>
<p>కర్ణాటక నుంచి కొత్తగా తీసుకువచ్చిన 4 కుంకీ ఏనుగులతో పాటు, గతంలో ఇక్కడ ఉన్న మూడు కుంకీలు కూడా ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు ప్రదర్శిస్తున్న నైపుణ్యాలను, అలాగే ఇటీవల అవి పాల్గొన్న ఆపరేషన్ల తీరును అధికారులు ఆయనకు వివరించారు.<img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/11/09/d2d3aea53f31572caf36aaa7e531f73a1762692123215233_original.jpg" width="816" height="646" /></p>
<p><strong>ఏనుగుల ప్రదర్శన, నూతన క్యాంపు ప్రారంభం</strong><br />ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు చేసిన ప్రత్యేక ప్రదర్శన పవన్ కళ్యాణ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏనుగులు క్రమబద్ధంగా వరుసగా వచ్చి, ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కి సెల్యూట్ చేశాయి. అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువస్తారో ప్రదర్శింపజేశారు. మనుషులు -ఏనుగుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు, మదపుటేనుగుల గుంపు నివాసాలు లేదా పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో కుంకీ ఏనుగుల ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు.</p>
<p><strong>ఏనుగులకు ఆహారం అందించిన పవన్ కళ్యాణ్</strong></p>
<p>మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి కోపాన్ని ఎలా అణిచివేస్తారో మావటీలు చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్‌ను ఆయన ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శన అనంతరం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగులకు స్వయంగా బెల్లం ఆహారాన్ని అందించారు. అనంతరం గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/11/09/919d214333e95d0c5140a5ba0014b6761762692145012233_original.jpg" width="780" height="520" /></p>
<p>అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన క్యాంపు శిలా ఫలకాన్ని, ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి సంబంధించిన పునాదిరాయిని కూడా ఆయన వేశారు. అంతేకాకుండా, సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి కూడా ఆయన పునాది రాయి వేశారు.</p>
<p><strong>మియావకీ ప్లాంటేషన్, మావటీలకు బహుమానం</strong><br />ఈ కేంద్రం వద్దే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా దట్టమైన అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ ను ఏర్పాటు చేయగా, ఆయన ఉసిరి మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీటరుకు ఒక్కటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్‌ను స్వయంగా మొబైల్‌లో వీడియో తీసుకున్నారు. మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఆయన అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.<img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/11/09/c01084656b2cf6336522e344d693d5a51762692444264233_original.jpg" width="753" height="529" /></p>
<p><a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a> ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు, పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న మావటీల పని తీరును మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు రూ.50 వేలు బహుమానంగా అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు సహా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>