<p><strong>Brahmin Board :</strong> రాష్ట్ర కేబినెట్ మంత్రికి సమానమైన హోదా కలిగి ఉన్న మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ బోర్డు అధిపతి రాజోరియా ఊహించని ఆఫర్ ప్రకటించారు. కనీసం నలుగురు పిల్లలను కలిగి ఉండాలని నిర్ణయించుకునే బ్రాహ్మణ దంపతులకు రూ.1 లక్ష నజరానా ప్రకటించి సంచలనం సృష్టించారు. బ్రాహ్మణ సంస్థ అయిన పరశురామ్ కళ్యాణ్ బోర్డ్‌కు నాయకత్వం వహిస్తున్న పండిట్ విష్ణు రాజోరియా.. నేటి యువత ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారని చెప్పారు. ఇది పెద్ద సమస్యగా మారిందని.. అందుకే ప్రతీ జంట నలుగురు పిల్లలు కనాలని చెబుతున్నానని స్పష్టం చేశారు.</p>
<p><strong>నా ఆశలన్నీ నేటి యువతపైనే</strong></p>
<p>భవిష్యత్తు తరాన్ని రక్షించే బాధ్యత యువతపై ఉందని రాజోరియా చెప్పారు. దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, మనం కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ‘నాకు యువత మీదే చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే వయసు పైడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం కదా. జాగ్రత్తగా వినండి. భవిష్యత్‌ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. యువత జీవితంలో స్థిరపడి కేవలం ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడిది పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను కోరుతున్నాను’ అని తెలిపారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.</p>
<p><strong>నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష మీవే</strong></p>
<p>అంతేకాదు నలుగురు పిల్లలను కన్న బ్రాహ్మణ జంటకు పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు తరపు నుంచి రూ.లక్ష బహుమతి లభిస్తుందని కూడా రాజోరియా చెప్పారు. తాను బోర్డు అధ్యక్షుడిగా ఉన్నా, దిగిపోయినా.. ఈ నగదు బహుమతి మాత్రం ఆగదన్నారు. చాలా మంది తమ పిల్లల చదువుకు భారీగా ఖర్చవుతుందని, ఆ భయంతో పిల్లలను కనడం మానొద్దని.. అలా చేస్తే దేశం పూర్తిగా నాస్తికుల చేతుల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు.</p>
<p><strong>ఈ ప్రకటన పూర్తిగా నా వ్యక్తిగతమే</strong></p>
<p>ఇక తాజాగా చేసిన ప్రకటనపై రాజోరియా స్పందిస్తూ.. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పిల్లలను చదివించడం, ఉన్నత స్థానాలకు చేర్చడం బ్రాహ్మణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదని, బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానన్నారు.</p>
<p><strong>ఆయన వ్యాఖ్యలపై పునరాలోచించుకోవాలి: కాంగ్రెస్ నేత</strong></p>
<p>రాజోరియా ప్రకటనకు అధికార భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండగా, అది అతని "వ్యక్తిగత అభిప్రాయం" అని పేర్కొంటూ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> నాయకుడు ముఖేష్ నాయక్ తన వ్యాఖ్యను పునరాలోచించుకోవాలని కోరారు. జనాభా పెరుగుదల అనేది ప్రపంచంలోని అతి పెద్ద సమస్యలలో నేడు ఒకటిగా ఉందని, పిల్లలు ఎంత తక్కువగా ఉంటే, వారి విద్యను నిర్ధారించడం అంత సులభం అవుతుంది” అని నాయక్ అన్నారు. ఇవన్నీ ఊహాత్మక ఆలోచనలని, మనం ఐక్యంగా ఉన్నప్పుడే మన దేశం శక్తివంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.</p>
<p><strong>Also Read : <a href="https://telugu.abplive.com/crime/bus-conductor-attacked-on-retired-ias-officer-in-jaipur-video-gone-viral-194016">Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో</a></strong></p>