<p><strong>Polling for six MLC Seats : </strong>తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా రాజకీయ హడావుడికి కారణం అవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీలో మూడు, తెలంగాణ మూడు స్థానాలకు పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీ లో ఉంది. తెలంగాణలో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేయగా..కాంగ్రెస్ ఒక్క స్థానంలో పోటీ చేసింది. </p>
<p><strong>ఏపీలో పలు చోట్ల డబ్బుల పంపిణీ </strong></p>
<p>ఏపీలో రెండు గ్రాడ్యూయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యూయేట్ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. టీచర్ స్థానానికి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా రాజశేఖరం పోటీ చేశారు. వైసీపీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీతో ఇతర అభ్యర్థులు పోటీ పడ్డారు. బరిలో భారీగా అభ్యర్థులు నిలిచిన టీడీపీ ప్రదాన పార్టీగా బరిలో ఉంది. </p>
<p>ఏపీలో అన్నిచోట్లా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే పలు చోట్ల అధికారులు <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>కి మద్దతుగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ బూత్‌ల వద్ద స్లిప్పులు ఇచ్చే కేంద్రాల్లో ప్రచార పోస్టర్లు ఉంచారని.. నేరుగా ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ. మూడు వేల చొప్పున పంచారని ఇతర అభ్యర్థులు ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ కొొన్ని వీడియోలను మీడియాకు పంపించారు. </p>
<p>ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>, లోకేష్ తాడేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరవై శాతానికిపైగా ఓటింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది. బ్యాలెట్ పేపర్ తో నిర్వహించిన ఓటింగ్ కావడంతో పూర్తి వివరాలు రావడానికి మరో రోజు పట్టవచ్చని భావిస్తున్నారు. <br /> </p>
<p><strong>తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ </strong></p>
<p>తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనే పోటీ చేసింది. మిగతా రెండు టీచర్ ఎమ్మెల్సీలకు మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చింది. ఆ ఒక్క స్థానంలో గెలిచి తీరాలని <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> , <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> గట్టిగా ప్రయత్నించాయి. పోలింగ్ కూడా జోరుగా సాగింది. అరవై శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యాయి. ఎక్కడా చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. </p>
<p><strong>మూడో తేదీన ఫలితాలు </strong></p>
<p>మూడో తేదీన కొంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఎన్నిక కావడంతో కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. అదే సమయంలో గెలుపు లెక్క కూడా వేరుగా ఉంటుంది. పోలైన ఓట్లలో యాభై శాతం వస్తేనే ఎవరైనా గెలుస్తారు.లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. </p>
<p> </p>