<p style="text-align: justify;"><strong>United Nations Secretary General Award:</strong> భారత సైన్యం అధికారి మేజర్ స్వాతి శాంతా కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. జెండర్‌ ఈక్వాలిటీ, శాంతి స్థాపనలో చేసిన కృషికి ఆమెకు ఈ పురష్కారం లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ 2025 UN సెక్రటరీ-జనరల్స్ అవార్డుతో ఆమెను సత్కరించారు. ఈ అవార్డును ఆమెకు జెండర్‌ విభాగంలో అవార్డుతో సత్కరించారు. మేజర్ స్వాతి దక్షిణ సూడాన్‌లో పనిచేస్తూ 'ఈక్వల్ పార్ట్‌నర్స్, లాస్టింగ్ పీస్' ప్రాజెక్ట్ ద్వారా జెండర్‌ ఈక్వాలిటీ, శాంతి స్థాపన కోసం చాలా కాలంగా పని చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చాలా విధాలుగా సహకారం అందించారు.</p>
<h3>మేజర్ స్వాతి ఎవరు?</h3>
<p>మేజర్ స్వాతి శాంతా కుమార్ బెంగళూరుకు చెందినవారు. ఆమె కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME)లో అధికారి. ఆమె బెంగళూరులో పాఠశాల విద్యను పూర్తి చేసి, న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. తరువాత ఆమె భారత సైన్యంలోకి సేవలు అందించేందుకు చేరారు. ఆమె గతంలో IBM కంపెనీలో పని చేశారు, కాని తరువాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు.</p>
<h3>మహిళా ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్ స్వాతి</h3>
<p>ప్రస్తుతం మేజర్ స్వాతి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ (UNIMSS)లో పనిచేస్తున్నారు. ఆమె అక్కడ భారతీయ బెటాలియన్‌లో సేవలు అందిస్తున్నారు. ఆమె మొదటి మహిళా ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్‌గా ఉన్నారు. మేజర్ స్వాతి నేతృత్వంలోని బృందం మలకల్ ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం స్థానికంగా విస్తృతంగా పెట్రోలింగ్, రివర్‌ పెట్రోలింగ్‌, ఏరియల్‌ పెట్రోలింగ్‌ కూడా నిర్వహించారు. ఈ ప్రయత్నాలతో 5,000 మందికిపైగా మహిళలకు సహాయం లభించింది. వారందరికీ సురక్షితమైన, సహాయక వాతావరణం ఏర్పడింది. మహిళలు ఇప్పుడు స్వయంగా ముందుకు వచ్చి తమ సమస్యలను పంచుకుంటున్నారు. మొదట్లో మహిళలు మాట్లాడటానికి ఇష్టపడే వాళ్లు కాదు. కానీ స్వాతి వచ్చిన తర్వాత వారి పని తీరు, సమస్యల పరిష్కారం గురించి తెలుసుకున్న వారంతా ఇప్పుడు నిర్భయంగా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు వివరిస్తున్నారు. </p>
<h3>UN ప్రధాన కార్యదర్శి స్వాతి ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు</h3>
<p>ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న UN శాంతి పరిరక్షణ మిషన్లు, ఏజెన్సీల నుంచి వచ్చిన నామినేషన్ల నుంచి ఎంపిక చేశారు. UN చార్టర్ ప్రకారం స్వాతి ప్రాజెక్ట్ జెండర్‌ ఈక్వాలిటీ,శాంతిని ప్రోత్సహించడాన్ని గుర్తించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆమె ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు. ఇది భవిష్యత్ శాంతి మిషన్లకు బలమైన ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. </p>
<h3>మేజర్ స్వాతికి త్వరలో భారతదేశంలో పోస్టింగ్ </h3>
<p>మేజర్ స్వాతి దాదాపు 15 నెలలుగా దక్షిణ సూడాన్‌లో ఉన్నారు. త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చి సికింద్రాబాద్‌లో పోస్టింగ్ తీసుకుంటారు. ఆమెకు లభించిన ఈ గౌరవం భారతదేశానికి గర్వకారణం. మహిళా సైనికుల పాత్రను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపరుస్తుంది.</p>
<p>మేజర్ స్వాతి తండ్రి ఆర్. శాంతా కుమార్ (మాజీ ITC ఉద్యోగి) మాట్లాడుతూ, 'మా కుటుంబంలో ఎటువంటి మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ లేదు, కాని స్వాతి కష్టపడి సైన్యంలో చేరింది. నేను చాలా గర్వపడుతున్నాను.' ఆమె తల్లి రాజమణి (రిటైర్డ్ హెడ్‌మిస్ట్రెస్) కూడా కుమార్తె కృషిని, అంకితభావాన్ని ప్రశంసించారు.</p>