<p><strong>Team India World Champions:</strong> ఖోఖోలో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. సొంతగడ్డపై జరిగిన ఇనాగ్యురల్ ప్రపంచ కప్‌లో అపజయం లేకుండా టైటిల్ సాధించింది. ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40 తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి వరుసగా పాయింట్లు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఏ దశలోనూ కోలుకునే అవకాశమివ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. సారథిగా జట్టును ముందుండి నడిపింది. వైష్ణవీ పవార్, సంజన బి, ప్రియాంక , చైత్ర.. భారత్ తరపున పాయింట్లు సాధించి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. </p>
<p>ఫైనల్ పోరు టర్న్‌ 1లో భారత్‌ దూకుడు ప్రదర్శనను కనబరిచింది. దీంతో 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో టర్న్‌లో నేపాల్‌ పుంజుకోవడం వల్ల 35-24తో ముగిసింది. ఇక మూడో టర్న్‌లో భారత్ మళ్లీ దూకుడు ప్రదర్శించడం వల్ల, వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి (49) దూసుకెళ్లింది. చివరి టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు సాధించడం వల్ల, భారత్ 38 పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుని ఛాంపియన్‌గా అవతరించింది. 23 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు అజేయంగా టోర్నీని ముగించింది.</p>
<p>ఖోఖో ప్రపంచకప్‌ టోర్నీకి తొలిసారి భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన టోర్నీలో భారత మహిళలు ఆది నుంచి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో నేపాల్‌తో భారత ఖోఖో క్రీడాకారులు తలపడ్డారు. 78-40 స్కోర్‌తో నేపాల్‌ మహిళలను భారత నారీమణులు చిత్తుగా ఓడించారు. 38 పాయింట్ల భారీ తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను భారత ఖోఖో మహిళలు కైవసం చేసుకున్నారు.</p>
<p><strong>ఎదురే లేదు..</strong><br />టర్న్‌-1లో భారత జట్టు అత్యద్భుతంగా ఆడి డిఫెన్స్‌లో నేపాల్‌ అమ్మాయిల తప్పిదాలను విజయానికి మలుపులుగా భారత మహిళలు చేసుకున్నారు. కాగా ఈ టోర్నీలో భారత ఖోఖో క్రీడాకారులు అత్యుద్భుతంగా ఆడుతూ వచ్చారు. తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న భారతదేశం ట్రోఫీని గెలుపొందడం విశేషం. ఆతిథ్యం ఇస్తూనే ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి వారిని తిరుగుముఖం పట్టించారు. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది. 176 పాయింట్లు సాధించి అఖండ విజయాన్ని భారత మహిళలు పొందారు.</p>
<p><strong>అన్షు కుమారికి అవార్డు..</strong><br />ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్‌కు చెందిన అన్షుకుమారికి బెస్ట్ అటాకర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నేపాల్‌కు చెందిన మన్మతి ధానికి బెస్ట్ డిఫెండర్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్‌లో ఉత్తమ ఆటతీరు కనబర్చిన ఇండియాకు చెందిన బి.చైత్రకు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. </p>
<p><strong>Also Read:</strong> <a title="Siraj Vs Harshit: హర్షిత్ కోసం సిరాజ్‌ను పక్కన పెట్టారు - బోర్డు రాజకీయాలపై సోషల్ మీడియాలో ఫైర్" href="https://telugu.abplive.com/sports/cricket/md-siraj-out-of-favoured-in-icc-champions-trophy-by-team-india-management-194692" target="_blank" rel="noopener">Siraj Vs Harshit: హర్షిత్ కోసం సిరాజ్‌ను పక్కన పెట్టారు - బోర్డు రాజకీయాలపై సోషల్ మీడియాలో ఫైర్</a></p>