<p><strong>Bans the marketing of junk food: </strong>దేశంలో పెరుగుతున్న ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే 2026 నివేదిక ప్రకారం.. చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, బర్గర్లు వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్ ప్రకటనలపై ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కఠిన నిషేధాన్ని విధించాలని సూచించింది. పిల్లలు, యువత ఎక్కువగా టీవీలు, సోషల్ మీడియా చూసే సమయంలో ఈ అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వైపు వారు ఆకర్షితులు కాకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. </p>
<p><strong>పసిపిల్లలకు ఇచ్చే పాల పదార్థాల మార్కెటిగ్ పైనా ఆంక్షలు</strong></p>
<p>ప్రకటనల నిషేధంతో పాటు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలపై ముందు భాగంలోనే హెచ్చరికలు ముద్రించాలని సిఫార్సు చేసింది. ఇప్పటికే బ్రిటన్, చిలీ వంటి దేశాలు ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయని, భారతదేశం కూడా అదే బాటలో పయనించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా పసిపిల్లలకు ఇచ్చే పాల పదార్థాలు, పానీయాల మార్కెటింగ్ పై కూడా మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని నివేదిక నొక్కి చెప్పింది.</p>
<p><strong>వ్యాధిగ్రస్తమవుతున్న బాల్యం.. భయంకరమైన గణాంకాలు </strong></p>
<p>భారతదేశంలో ఊబకాయం సమస్య ఒక మహమ్మారిలా మారుతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2020లో దేశంలో సుమారు 3.3 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతుండగా, ప్రస్తుత ధోరణి కొనసాగితే 2035 నాటికి ఈ సంఖ్య 8.3 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో కూడా అధిక బరువు సమస్య 2.1 శాతం నుండి 3.4 శాతానికి పెరగడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయని సర్వే పేర్కొంది.</p>
<p><strong>ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. సంస్కరణలే మార్గం </strong></p>
<p>జంక్ ఫుడ్ వాడకం పెరగడం వల్ల కేవలం ప్రజల ఆరోగ్యమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడుతోందని సర్వే వివరించింది. ప్రజల ఉత్పాదకత తగ్గడం, ఆరోగ్య రక్షణ కోసం పెరిగే ఖర్చులు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని తెలిపింది. 2009 నుండి 2023 మధ్య కాలంలో భారత్‌లో జంక్ ఫుడ్ అమ్మకాలు 150 శాతానికి పైగా పెరిగాయి. అందుకే, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై అత్యధిక జీఎస్‌టీ పన్నులు విధించడం, పాఠశాలలు , కళాశాలల్లో జంక్ ఫుడ్ కంపెనీల స్పాన్సర్‌షిప్‌లను నియంత్రించడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం ఈ సర్వే ద్వారా పిలుపునిచ్చింది. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/amravati/iconic-towers-in-amaravati-are-being-built-using-the-diagrid-method-this-is-what-diagrid-means-236001" width="631" height="381" scrolling="no"></iframe></p>