<p>Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు,వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి విధానాలను తాము కొనసాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా రంగాలను వారు ఎంతో ప్రోత్సహించారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్‌ ది ప్రెస్‌' కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాలు మాట్లాడారు. 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు అని, జూన్ 2029లో ఎలక్షన్ జరుగుతాయి కానీ బీఆర్ఎస్ చెప్పినట్లు 500 రోజులకు ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.</p>
<p>సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌ నగరం నేడు జీసీసీలు (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు), డేటా సెంటర్లకు ఒక హబ్‌గా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం, నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అలాగే, వైఎస్సాఆర్ హయాంలో వచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మరియు ఔటర్‌ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సైతం హైదరాబాద్ అభివృద్ధికి చాలా ముఖ్యమని అన్నారు.</p>
<p><strong>రైతులకు ఉచిత విద్యుత్</strong></p>
<p>తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోయినా లెక్కచేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల హయాంలో రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశాయని తెలిపారు. దీనిలో భాగంగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై, అలాగే రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిల మాఫీపై మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. అంతేకాక, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూ. 73 వేల కోట్ల రుణమాఫీని అమలు చేసిందని, కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>
<p><strong>ఐటీ, నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్</strong></p>
<p>జలయజ్ఞం ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్, ఇందిరా సాగర్, ఎస్సార్ఎస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్ఎల్బీసీ మరియు ప్రాణహిత చేవెళ్ల వంటి అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య వచ్చినప్పుడు కుండలతో నిరసన తెలిపి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a>పై ఒత్తిడి తెచ్చి, కృష్ణా జలాలను నగరానికి తరలించేలా చేసి జంట నగరాల దాహార్తిని తీర్చిన ఘనత పీజేఆర్‌కే దక్కుతుంది. హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణం. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ, జంట నగరాలకు నిరంతర విద్యుత్ అందించడం వల్లే దిగ్గజ సంస్థలు నగరానికి తరలి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్ నుంచే అవుతోంది.ఇటీవలే ఎలీ లిల్లీ సంస్థ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, మెక్‌డొనాల్డ్ వంటి ప్రపంచంలోని 70 శాతం ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్‌లో తమ జీసీసీలను (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు) ఏర్పాటు చేసుకున్నాయి. దరాబాద్ గ్రోత్ కారిడార్‌గా తయారవడం వెనుక కాంగ్రెస్ కృషి ఉందన్నారు.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">Mark my word - Congress will be in power until June2034 in Telangana. <br /><br />Next Elections will be in June2029 that too Jamili Elections will happen - CM Revanth Reddy <a href="https://t.co/rEBTvwZ9Zn">pic.twitter.com/rEBTvwZ9Zn</a></p>
— Naveena (@TheNaveena) <a href="https://twitter.com/TheNaveena/status/1987427820109492518?ref_src=twsrc%5Etfw">November 9, 2025</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
</p>
<p><strong>దేశంలోనే రంగారెడ్డి టాప్</strong></p>
<p>తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని, దేశంలోనే అత్యధిక తొలి ఆదాయం (పర్ క్యాపిటా) ఉన్న జిల్లాగా రంగారెడ్డి నిలిచిందంటే అందుకు ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కారణమని <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> అన్నారు. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి మరియు 10 లక్షల ఎకరాల పోడు భూములను పంచిన ఘనత ఇందిరమ్మది అని, దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని పకడ్బందీగా అమలు చేసింది పీవీ నరసింహారావు మరియు ఇందిరా గాంధీ అని కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చిందని అన్నారు. ఇది చరిత్ర అని, కెసిఆర్ చెరిపేస్తే చెరిపేది కాదని వ్యాఖ్యానించారు.</p>
<p>ఆనాటి <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పదేళ్ల పాలన, <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> పదేళ్ల పాలనను పోల్చి చూడాలని సీఎం ప్రజలను కోరారు. రూ. 60 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే, పదేళ్లలో రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పులతో తమకు అప్పగించారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో, రాష్ట్రం పాతాళంలోకి పడిపోయే స్థితిలో తమకు అప్పగించారని ఆరోపించారు. కమాండ్ కంట్రోల్, సచివాలయం, ప్రగతి భవన్ వంటి కట్టడాల వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. కాళేశ్వరం లేకపోయినా తమ ప్రభుత్వంలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు.</p>
<p>బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా, కనీసం వీసీలను కూడా నియమించలేదని విమర్శించారు. 5 వేల పాఠశాలలు మూసేశారని, పేదలకు విద్యను, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారని ఆరోపించారు. రూ. 1 లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకపోతే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదని, టిమ్స్‌లు పూర్తి చేయలేదని విమర్శించారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అని ప్రశ్నించారు. ధృతరాష్ట్రుడు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.</p>