<p><strong>Human Trafficking Bangladeshis Telangana:</strong> భాగ్యనగరంలో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎటువంటి పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు.. గత కొంతకాలంగా ఇక్కడే ఉంటూ స్థానిక కంపెనీల్లో కార్మికులుగా చలామణి అవుతున్నారు. నమ్మకమైన సమాచారం అందుకున్న పోలీసులు జీడిమెట్ల పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ ముఠాను పట్టుకున్నారు. </p>
<p><strong>బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి..అక్కడి నుంచి హైదరాబాద్‌కు </strong></p>
<p>పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుల నుంచి విస్మయకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా దళారుల సహాయంతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలింది. ఆ తర్వాత స్థానిక ఏజెంట్ల సాయంతో పశ్చిమ బెంగాల్ చిరునామాలతో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, చివరకు ఓటర్ ఐడీ కార్డులను కూడా సృష్టించారు. ఈ నకిలీ గుర్తింపు కార్డులను చూపించి హైదరాబాద్‌లో ఇళ్లను అద్దెకు తీసుకోవడమే కాకుండా, స్థానిక పరిశ్రమల్లో ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యోగాలు సంపాదించారు. </p>
<p><strong>పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఉందా? </strong><br /> <br />ఇలాంటి అక్రమ వలసదారుల వెనుక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ పనిచేస్తోందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేవలం ఉపాధి కోసమే వీరు ఇక్కడికి వచ్చారా? లేక దీని వెనుక ఏవైనా దేశ విద్రోహ శక్తుల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలోనూ హైదరాబాద్ శివార్లలోని పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట, బాలానగర్ ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు పట్టుబడిన ఉదంతాలు ఉండటంతో.. ఈ ఏడుగురిని ఇక్కడికి తీసుకువచ్చిన ప్రధాన ఏజెంట్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. </p>
<p><strong>ఇక్కడ ఉద్యోాగాలే చేస్తున్నారా.. ఇంకా ఏమైనా ఉన్నాయా? </strong></p>
<p>నిందితులు అక్రమ సంపాదనను హవాలా మార్గాల ద్వారా బంగ్లాదేశ్‌లో ఉన్న తమ కుటుంబాలకు చేరవేస్తున్నట్లు కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుల నుంచి నకిలీ భారతీయ పత్రాలతో పాటు పలు మొబైల్ ఫోన్లు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఫారినర్స్ యాక్ట్ తో పాటు భారతీయ న్యాయ సంహిత లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీసాల గడువు ముగిసినా, లేదా అక్రమంగా దేశంలోకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. <br /> <br />ఇంటి యజమానులు ఎవరైనా సరే.. కొత్తవారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/health/do-not-consume-these-4-items-with-tea-even-by-mistake-250189" width="631" height="381" scrolling="no"></iframe></p>
<p> </p>