<p><strong>Jagan Against Amaravati Land pooling: </strong>అమరావతి రాజధాని విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యతిరేకంగా స్పందించారు. ప్రధానంగా రైతుల సమస్యలు, రెండో దశ భూసేకరణ అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.</p>
<p>అమరావతి కోసం మొదటి దశలో భూములిచ్చిన రైతులు ఒకవైపు కన్నీరు మున్నీరవుతున్నారని జగన్ పేర్కొన్నారు. గతంలో భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, అక్కడ కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. రైతుల భూముల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, వారిని రోడ్డున పడేశారని ఆరోపించారు. మొదటి దశలో సేకరించిన భూములను అభివృద్ధి చేయని ప్రభుత్వం, ఇప్పుడు రెండో దశ పేరుతో మరో 50,000 ఎకరాల భూమిని సేకరించాలని చూడటం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న భూములకే దిక్కులేదు కానీ, కొత్తగా వేల ఎకరాలను సేకరించడం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ అదనపు భూసేకరణ వల్ల పేద రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. </p>
<p>రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అమరావతి పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడం, భారీగా అప్పులు తీసుకురావడం సమంజసం కాదని <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> అన్నారు. ఈ ప్రాజెక్టును నిధుల దోపిడీ కేంద్రం గా మార్చుకున్నారని, కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఒకే ప్రాంతంపై కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత అభివృద్ధి జరగాలని ఆయన తన పాత డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు. </p>
<p> </p>