<p style="text-align: justify;">భారత క్రికెట్ కు కీలకమైన రోజు నేడు. హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీమ్ తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ సమయంలో భారత క్రికెట్ ప్రపంచంలో ఒక విషాదం చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన భారత జట్టు తరపున అండర్-19 ప్రపంచ కప్ కూడా ఆడారు. </p>
<p style="text-align: justify;">రాజేష్ బానిక్ వయసు 40 సంవత్సరాలు కాగా, పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్‌లో ఆయన చనిపోయారు. రాజేష్ మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లతో కలిసి రాజేష్ ఆడారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రతా డే రాజేష్ బానిక్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.</p>
<h3 style="text-align: justify;"><strong>రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ మృతి</strong></h3>
<p style="text-align: justify;">మీడియా నివేదికల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయనను అగర్తలలోని జిబిపి ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూనే రాజేష్ కన్నుమూశారు. ఆయన త్రిపుర తరపున రంజీ ట్రోఫీలో కూడా ఆడారు.</p>
<p style="text-align: justify;">త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రతా డే మాట్లాడుతూ.. 'మేము ఒక ప్రతిభావంతులైన క్రికెటర్, అండర్ -16 క్రికెట్ జట్టు సెలెక్టర్‌ను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలిసి మేం ఆశ్చర్యపోయాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి. రాజేష్ అత్యంత అద్భుతమైన ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను సులభంగా గుర్తించగల సామర్థ్యం ఆయన సొంతం. అందుకే రాజేష్‌ను యంగ్ టాలెంట్ గుర్తించేందుకు రాష్ట్ర అండర్ -16 జట్టుకు సెలెక్టర్‌గా నియమించారు' అని తెలిపారు.</p>
<p style="text-align: justify;">40 ఏళ్ల రాజేష్ బానిక్ తన క్రికెట్ కెరీర్‌లో 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 1469 పరుగులు చేశారు. దీనితో పాటు రాజేష్ లిస్ట్ ఎ లో 24 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 378 పరుగులు చేసి 8 వికెట్లు తీశాడు. 18 టీ20 మ్యాచ్‌లలో 203 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ రంజీ ట్రోఫీని 2018లో ఒడిశాపై ఆడాడు.</p>