<p>HMPV Cases In India: న్యూఢిల్లీ: గత డిసెంబర్ లో చైనాలో కలకలం రేపిన హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు ప్రస్తుతం భారత్‌ను కలవరపెడుతోంది. ఇదివరకే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా పుదుచ్చేరిలో మరోకరిలో వైరస్ గుర్తించారు. పుదుచ్చేరిలో ఒక చిన్నారికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో HMPV పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరింది. </p>
<p>పుదుచ్చేరిలో ఓ బాలిక కొన్ని రోజుల కిందట జ్వరం, దగ్గు, జలుబు సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. పుదుచ్చేరిలో నమోదైన రెండో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసు ఇది. జనవరి మొదటి వారంలో మూడేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఆ చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. చిన్నారి వైద్య చికిత్సలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పుదుచ్చేరి హెల్త్ డైరెక్టర్ వి రవిచంద్రన్ తెలిపారు.</p>
<p>పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసుతో కలిపితే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. గరిష్టంగా గుజరాత్‌లో 5 కేసులు, మహారాష్ట్ర, కోల్‌కతాలో మూడు చొప్పున, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు చొప్పున, అస్సాంలో ఒక హెచ్ఎంపీవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోనూ చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసు కలిగిన చిన్నారులలో వైరస్ ప్రవేశిస్తుంది. దాంతో దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలున్న కొందరు చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా ఏదో చోట హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. </p>
<p> </p>