<p>IND vs PAK T20 World Cup 2026 | కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో 27వ లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి ప్రత్యర్థి పాక్ కు భారీ టార్గెట్ ఇచ్చింది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరపున ఇషాన్ కిషన్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఓపెనర్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.</p>
<p>పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ జట్టు ప్రధానంగా స్పిన్ బౌలింగ్ పై ఫోకస్ చేసింది. ఆ జట్టు ఏకంగా 18 ఓవర్లు స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. మిగిలిన 2 ఓవర్లను ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ వేశాడు. పాకిస్థాన్ తరపున మొత్తం 7 మంది బౌలింగ్ చేయగా, అందులో ఆరుగురు స్పిన్నర్లే ఉన్నారు. దాంతో వేగంగా పరుగులు రాబట్టం భారత బ్యాటర్లకు కష్టమైంది. </p>
<p><strong> టాస్ గెలిచిన పాకిస్థాన్</strong><br />ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మరి పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సరైనదో తెలియాలంటే వారి బ్యాటింగ్ కూడా పూర్తి కావాలి. </p>
<p><strong>భారత్‌కు చెత్త ఆరంభం</strong><br />మొదట బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా ఆరంభం చాలా పేలవంగా సాగింది. జట్టు తన తొలి వికెట్‌ను మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ రూపంలో కోల్పోయింది. అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తరువాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో ఇషాన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.</p>