<p>భారతదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ తొలిసారిగా టీమిండియాను ఓడించింది. ఇండోర్‌లో జరిగిన మూడవ వన్డేలో, కివీస్ భారత్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ముగ్గురు సెంచరీలు బాదేశారు. టీమ్ ఇండియాకు 338 పరుగుల లక్ష్యం నిర్దేశించగా.. చివరి ఓవర్ల వరకు విరాట్ ఆదుకున్నాడు. కానీ కోహ్లీ 124 పరుగుల ఇన్నింగ్స్ విజయం సాధించలేకపోయింది. ఇండోర్‌లో భారత్ ఓటమికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి.</p>
<p><strong>జట్టుకు బారంగా మారిన నితీష్ రెడ్డి </strong><br />భారత జట్టు మంచి పేస్ ఆల్ రౌండర్ అవసరం. హార్దిక్ పాండ్యా తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ వెతుకుతోంది. పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి వన్డే సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. ఇండోర్ వన్డేలో అతను 8 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి వికెట్ కూడా తీయలేకపోయాడు. నితీష్ ఎక్కువగా మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేశాడు. అక్కడ డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అతనిని సులభంగా ఎదుర్కొన్నారు. 125-130 కి.మీ./గం వేగంతో అతని బౌలింగ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయింది. మరోవైపు వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు.</p>
<p><strong>క్రిస్టియన్ క్లార్క్ ను ఛేదించడంలో భారత్ విఫలమైంది</strong><br />రాజ్‌కోట్, ఇండోర్ వన్డేలలో క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్ భారత బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించింది. రాజ్‌కోట్‌లో క్రిస్టియన్ క్లార్క్ తీసిన మూడు వికెట్లు భారత ఓటమికి ప్రధాన కారణం. 3వ వన్డేలో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి వికెట్లను కూడా అతనే పడగొట్టాడు. </p>
<p><strong>డెత్ ఓవర్లలో పేలవమైన బౌలింగ్</strong><br />గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌ను పేలవమైన ప్రారంభం నుండి కాపాడి భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. చివరి 10 ఓవర్లలో భారత బౌలర్లు 99 పరుగులు ఇచ్చారు. డెత్ ఓవర్లలో హర్షిత్ రాణా కూడా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడు వికెట్లు తీసుకున్నాడు కానీ 10 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చాడు.</p>
<p><strong>బ్యాటింగ్‌లో విఫలం..</strong><br />భారత జట్టు 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా సక్సెస్ కాలేదు. భారత జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మూడో వన్డేలో విఫలమయ్యారు. ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ కూడా ఒక పరుగు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు వైవిధ్యాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. భారతదేశం 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ ఒంటరిగా పోరాడటానికి ప్రయత్నించాడు. అతడికి నితీష్ రెడ్డి, ఆ తరువాత హర్షిత్ రాణా తోడుగా నిలిచి పరుగులు చేయడంలో తోడ్పాటు అందించారు.</p>
<p><strong>స్పిన్ బౌలింగ్ మళ్ళీ ఫెయిల్</strong><br />ఈ మొత్తం సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా 3 మ్యాచ్‌లలో మూల్యం చెల్లించుకున్నారు. గత రెండు మ్యాచ్‌లలో భారత స్పిన్నర్లు విలువైన పరుగులు సమర్పించుకున్నారు. కనుక భారత జట్టు యాజమాన్యం మూడవ మ్యాచ్‌లో అదనపు ఫాస్ట్ బౌలర్‌తో వెళ్లలేదు. ఇండోర్ వన్డేలో జడేజా, కుల్దీప్ మొత్తం 12 ఓవర్లు బౌలింగ్ చేసి 89 పరుగులు ఇచ్చారు.</p>
<p>Also Read: <a href="https://telugu.abplive.com/sports/cricket/ind-vs-nz-3rd-odi-highlights-scorecard-new-zealand-historic-odi-series-win-in-india-first-time-234882">Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్</a></p>