<p><strong>Rohit Sharma VS Virat Kohli: </strong>దాదాపు 7 నెల‌ల విరామం త‌ర‌వాత టీమిండియా వ‌న్డేల‌ను ఆడ‌నుంది. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల సిరీస్ ను ఆడ‌నుంది. ఈ సిరీస్ లో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ బ‌రిలోకి దిగుతారు. అయితే ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ రెండు బృందాలుగా వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈనెల 15న ఉద‌యం ఒక బృందం, సాయంత్రానికి మ‌రో టీమ్ బ‌య‌లు దేర‌నున్న‌ట్లు స‌మాచారం. న్యూఢిల్లీ నుంచి భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాలోని పెర్త్ న‌గ‌రానికి చేరుకోనుంది. తొలి వ‌న్డే వేదిక పెర్త్ కావ‌డంతో నేరుగా అక్క‌డికే బ‌య‌లు దేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న కోహ్లీ, రోహిత్.. 14న లేదా 15న టీమ్ తోక‌లిసి చేర‌తారని బోర్డు వ‌ర్గాలు తెలిపాయి. అయితే ఇలా రెండుజ‌ట్లుగా వెళ్ల‌డానికి గల కార‌ణాలు ఇలా ఉన్నాయి. ఆరోజు బిజినెస్ క్లాస్ టికెట్లు త‌గిన‌న్ని లేక‌పోవ‌డంతో విడ‌త‌ల వారీగా టీమిండియాను పంపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ ల‌తోపాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టుతో ఢిల్లీలోనే క‌లుస్తాడ‌ని తెలుస్తోంది. </p>
<p><strong>షార్ట్ బ్రేక్..</strong><br />ఇక ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపికైన ఆట‌గాళ్లు.. తాము ఆడుతున్న మ్యాచ్ లు అంత‌కుముందే ముగిసిన‌ట్లయితే చిన్న‌పాటి బ్రేక్ ఇచ్చేందుకు బోర్డు అంగీక‌రించింది. కొంత స‌మ‌యానికి త‌మ ఇంటికి వెళ్లి, మ‌ళ్లీ ఢిల్లీకి రావాల‌ని బోర్డు ఆదేశించింది. ఇక వెస్టిండీస్ తోరెండోటెస్టు ఈనెల 10-14 మ‌ధ్య ఢిల్లీ వేదిక‌గానే జ‌రుగుతుంది. అన్నీ అనుకున్న‌ట్లు జరిగితే, నిర్ణీత స‌మ‌యం క‌న్నా ఈ మ్యాచ్ కూడా త్వ‌ర‌గా ముగిసి పోతుంది. దీంతో టెస్టు ప్లేయ‌ర్లకు కాస్త స్మాల్ బ్రేక్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు కొత్త కెప్టెన్ తో భార‌త్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. రోహిత్ నుంచి శుభ‌మాన్ గిల్ కు ప‌గ్గాల‌ను బీసీసీఐ అందించింది. ఇప్ప‌టికే టెస్టు కెప్టెన్ గా ఇంగ్లాండ్ టూర్లో ఐదు టెస్టులు ఆడిన అనుభవం గిల్ కు ఉంది. </p>
<p><strong>గంభీర్ పార్టీ..</strong><br />త‌న సొంత‌గ‌డ్డ అయిన ఢిల్లీలో క్రికెటర్ల‌కు పార్టీ ఇచ్చేందుకు గంభీర్ సిద్ధ‌మ‌య్యాడు. స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను కొన‌సాగించే నేప‌థ్యంలో గంభీర్ పార్టీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఆసీస్ ప‌ర్య‌ట‌న గంభీర్ కు స‌వాలుతో కూడుకున్న‌ద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టూర్లో మూడు వ‌న్డేలు, 5 టీ20ల‌ను భార‌త్ ఆడ‌నుంది. ఇక కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న కోహ్లీ, రోహిత్ ల‌కు ఇది చాలా ముఖ్య‌మైన సిరీస్. అభిమానులు ముద్దుగా రోకో జోడీ అనే పిలుచుకునే ఈ జోడీ.. దీనిలో రాణించాల్సిన అవ‌స‌రం ఇద్దరికీ ఉంది. అప్పుడే తాము ఆశిస్తున్న‌ట్లుగా 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లోవారిద్ద‌రూ బ‌రిలోకి దిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్ లో ఓడిన తర్వాత ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత ఈ కప్పును సాధించి ఫుల్ జోష్ లో ఉన్న ఇండియా.. అదే జోరును ఆసీస్ టూర్లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. </p>